ఏపీలో జగన్ పగబట్టింది ఆ నలుగురినే..!!
హైదరాబాద్: ఏపీ లో అదికార, ప్రతిపక్షాల మద్య ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2019ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం చంద్రబాబు ఎంతగా శ్రమిస్తున్నారో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు రెట్టింపు శ్రమిస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ, చీటికి మాటికి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే నాయకులను జగన్ టార్గెట్ చేయబోతున్నారు. జగన్ విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ వైసీపికి కొరకరాని కొయ్యలుగా పరిణమించిన ఆ నలుగురు టీడిపి నేతల ఓటమి కోసం జగన్ ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం.

జగన్ టార్గెట్ ఆ నలుగురు ఎమ్మెల్యేలే..! ఎలాగైనా ఓడించాలే..!!
తరుచుగా ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న వైకాపా నేత జగన్ ఇప్పుడు మరో టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ నలుగురు టీడిపి నేతలను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. వారు జగన్ విమర్శలను ధీటుగా తిప్పికొడుతుండటమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మంత్రులు కె.అచ్చెంనాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వర రావులతో పాటు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని ఏ విధంగానైనా ఓడించాలని జగన్ నిశ్చయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురు మంత్రులు జగన్పై విమర్శలు, ఆరోపణలు చేయడంలో మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల కన్నా ముందుంటున్నారని సమాచారం.

ఒంటి కాలుపై లేస్తున్న ఆ నలుగురిని తప్పించాలి..! అందుకోసం బలమైన ప్రత్యర్థులను దించాలి..!
అదే విధంగా యరపతినేని జగన్ విమర్శలపై తరుచూ ఎదురు దాడి చేస్తున్నారు. దీంతో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల నుంచి ఈసారి వారిని ఓడించాలని జగన్ పట్టుదలతో ఉన్నట్టు లోటస్ పాండ్ వర్గాలు తెలుపుతున్నాయి. అందుకే వారిపై పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను జగన్ ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు నియోజకవర్గంలో ఆయనకు ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థులు రంగంలో ఉండడంతో అచ్చెంనాయుడు, అయ్యన్నపాత్రుడు స్వల్ప తేడాతో ఓటమి చెందారు. దేవినేని ఓడించేందుకు బలమైన నేత అయిన వసంతను జగన్ ఎంపిక చేశారు.

ఎక్కడ ఎలా ఉన్నా అక్కడ ఆ నాలుగు స్థానాల్లో మాత్రం వారు ఓడాలి..! అదే జగన్ లక్ష్యం..!
గురజాల నియోజకవర్గంలో పట్టున్న యరపతినేని ఓడించాలంటే కాసు కుటుంబంతోనే సాధ్యమనే నమ్మకంతో మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్రెడ్డిని జగన్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ని పక్కన పెట్టడంతో వైకాపా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే నియోజకవర్గంలో పర్యటించిన కాసు మహేష్రెడ్డి కి అక్కడ పరిస్థితి స్పష్టం కావడంతో ఎన్నికల బరి నుంచి తప్పుకునే అవకాశం అందనే చర్చ జరుగుతోంది. కాగా జనసేన ప్రభావం ఉంటుందో ఉండదో కానీ 2009 ఎన్నికల ఫలితాలు మళ్లీ పునరావృతం అయ్యే ప్రసక్తే లేదని మంత్రులు అయన్న, అచ్చెన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆ రెండు జిల్లాల టిడిపి నాయకులు అంటున్నారు.

బలమైన నియోజకవర్గం మైలవరం..! జగన్ కు అదే కలవరం..!
మైలవరంలో దేవినేని పరిస్థితిపై ఆయన అనుచరుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. నియోజకవర్గంలో ఒకసారి విజయం సాధించిన వారు మరోసారి విజయం సాధించలేరనే సాంప్రదాయం నడుస్తోంది. అయితే ఆ సాంప్రదాయాన్ని ఎదుర్కొని దేవినేని రెండుసార్లు విజయం సాధించారు. మూడవ సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ నేతగా చరిత్రకెక్కుతారని ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారట.ఇలాంటి పరిస్థితిలో జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలితాలిస్తాయనేది కూడా ప్రశ్నగేనే మారింది. మైలవరంలో దేవినేని కుటుంబానికి ప్రత్యేక ఓటు బ్యాంకు కూడా ఉంది. మరి ఇన్ని విఘ్నాలను అదిగమించి జగన్ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే..!












Click it and Unblock the Notifications