విజయమ్మను ఓడించినా మారలేదు: జగన్పై దేవినేని
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. జగన్ కేసుల నుండి తప్పించుకునేందుకే కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారని ఆరోపించారు.
జగన్కు స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రైతుల రుణమాఫీని జగన్ అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీకి తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు రైతుల రుణ మాఫీ పైన సంతకం పెడతారని చెప్పారు.

రైతు రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. పేదవారికి మూడు సెంట్ల భూమిని ఇస్తామని చెప్పారు. విశాఖలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను ఓడించినా జగన్లో మార్పు రాలేదన్నారు.
జగన్ చేస్తున్న విమర్శలపై మాట్లాడే తీరిక చంద్రబాబుకు లేదన్నారు. రైతు రుణమాఫీ అమలు గురించి తమ పార్టీ చంద్రబాబు, నాయకులు తలమునకలై ఉన్నారని చెప్పారు. రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామన్నారు. ఇకనైనా జగన్ తమపై విమర్శలు చేయడం మాని, ప్రజా సమస్యలను పట్టించుకుంటే మంచిదన్నారు.












Click it and Unblock the Notifications