నిబంధనలతో రైతులకు ఇబ్బందులు.!భరోసా ఇవ్వని జగన్ సర్కార్.!ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన.!
అమరావతి/హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యదిక శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతుంటే పాలకులు మాత్రం రైతుల ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఘాటుగా విమర్శించారు. భారీ వర్షాలతో పంటలు దెబ్బ తింటే కనీసం నష్టం వివరాలను కూడా సక్రమంగా సేకరించడం లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న మనోహర్ సోమవారం ఉదయం అమలాపురం సమీపంలోని సమనస గ్రామంలో పంట పొలాలకు వెళ్ళి మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో, రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. కౌలు రైతు మధుర సాయిబాబు భారీ వర్షాలతో పంట నీట మునగటంతో గుండె పోటు వచ్చి మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.

వైసీపీ ప్రభుత్వానిది రైతు వ్యతిరేక పాలన..పంట నష్టం వివరాల సేకరణలోనూ నిర్లక్ష్యమేన్న జనసేన
ఇదిలా ఉండగా రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందో పచ్చటి కోనసీమను చూస్తే అర్థం అవుతోందని, ఇక్కడి రైతాంగంలో తీవ్ర ఆవేదన ఉందని, వ్యవసాయాన్ని నిలబెట్టిన గొప్ప రైతులు కోనసీమలో ఉన్నారని, ఇప్పుడు వారే ఆవేదనకు లోనైతే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసారు. పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం సక్రమంగా వివరాలు సేకరించి ప్రతి రైతునీ ఆదుకోవాలని, వైసీపీ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి తగిన సమాచారం కూడా రైతులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు దక్కని భరోసా.. తడిసిన ప్రతి గింజనీ ప్రభుత్వం కొనాలన్న మనోహర్
అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం ప్రతి రైతునీ కలసి పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించాలని, గతంలో వ్యవస్థలు ఏ విధానాన్ని తెచ్చినా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేవని, ఇప్పుడు అది కాస్త 30 శాతం మందికి మాత్రమే ఉపయోగపడేలా ముందుగానే నిర్ణయించి, మండలానికి ఇంతే పరిహారం ఇవ్వండని అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారని, ఇది అన్యాయమైన విధానమని, ఇది కచ్చితంగా రైతు వ్యతిరేక పాలన అని మనోహర్ ధ్వజమెత్తారు.
ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. జగన్ సర్కర్ రైతులకు న్యాయం చేయలేదన్న జనసేన
ఇటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని, ఇలాగైతే రైతులు, కౌలుకు సాగు చేసేవారి పరిస్థితి ఏంటని, విపత్తుల మూలంగా కలిగిన నష్టం అంచనాలు ఇప్పటి వరకు రూపొందించలేదని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు భరోసా లేదని, ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం వస్తుందని ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ ఎదురవుతోందని, జగన్ ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలుగా ఇబ్బందిపెడుతోందని, కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కూడా అందకుండా సమస్యలు సృష్టిస్తోందని మనోహర్ మండిపడ్డారు.
Recommended Video
6 లక్షల కోట్లు అప్పు చేసి ఏం సాధించారు? ఒక్కపైసా రైతుకు అచ్చారా.? నిలదీసిన జనసేన
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఇలా నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందని ఆశించిన రైతులు ఇబ్బందిపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. ఇన్ పుట్ సబ్సిడీ సరిగా రాలేదు. గత సంవత్సరం పంట తాలూకు డబ్బు ఈ రోజుకీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వైసీపీ ప్రభుత్వ పరిపాలన రైతుకి వ్యతిరేకంగా జరుగుతుంది. ఎక్కడా రైతుకి అనుకూలంగా జరగడం లేదు. ప్రతి ప్రాంతంలో నష్టం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. ఆరు లక్షల కోట్లు రుణాలు తీసుకువచ్చారని, 70 శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రాష్ట్రం కాబట్టి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి స్పందించాలని జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications