ఆ విషయంలో జగన్ ఎవరినీ ఉపేక్షించవద్దన్నారు.. : అవంతి శ్రీనివాస్
విశాఖలో భూకబ్జాలపై టీడీపీ వేసిన నిజ నిర్దారణ కమిటీపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీపై విరుచుకుపడ్డారు.విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ దుష్ఫ్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలిలో గజం స్థలం కూడా కబ్జాకు గురికాలేదన్నారు. టీడీపీ నేతలు అసత్యాలతో తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆ విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దన్న జగన్..
విశాఖలో టీడీపీ నేతల భూ దాహానికి అడ్డూ అదుపు అన్నది లేకుండా పోయిందని అవంతి ఆరోపించారు. విశాఖలో కబ్జాలకు పాల్పడింది టీడీపీ నేతలే అని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో ల్యాండ్ మాఫియాను పూర్తిగా కంట్రోల్ చేశామన్నారు. ఆక్రమణలు, భూ కబ్జాల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని చెప్పారు. అవినీతి రహిత పాలన అందించడం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు.
ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిందేంటి..
ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా పెడతామంటే స్వాగతించాల్సిందిపోయి టీడీపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి టీడీపీకి నచ్చడం లేదన్నారు. ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిందేమీ లేదని.. వైసీపీ ప్రభుత్వం చేస్తుంటే అడ్డుకుంటోందని అన్నారు.
కుట్రలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
కుట్రలు,కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అవంతి శ్రీనివాస్ విమర్శించారు. తమ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తుంటే టీడీపీ భయం పట్టుకుందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఐదు నెలల్లోనే పూర్తి చేశామని,అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని మరోసారి హామీ ఇచ్చారు. ఉగాదికి 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.
నిప్పులు చెరిగిన గుడివాడ అమర్నాథ్..
అంతకుముందు మరో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా టీడీపీపై నిప్పులు చెరిగారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిందంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని.. కానీ వారి హయాంలోనే వేల ఎకరాలు కబ్జా అయ్యాయని ఆరోపించారు. నిరాధార ఆరోపణలతో వైసీపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నంలో భూదోపిడీలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.నిజ నిర్ధారణ కమిటీ విశాఖలో కాదని.. అమరావతిలో వేసుకోవాలని అమర్నాథ్ సూచించారు.