ప్రశ్నిస్తానన్న పవన్ ఏమయ్యాడు...లగడపాటిలాంటి జిత్తులు తెరమీదకు వస్తారు: జగన్
నెల్లూరు: ప్రశ్నిస్తానన్న పవన్ ఏమయ్యాడు.. ఈ సారి ఎన్నికల్లో లగడపాటిలాంటి జిత్తుల మారి నక్కలు తెరమీదకు వస్తారని వారిని నమ్మరాదని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమరశంఖారావం సభలో జగన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ధ్వజమెత్తారు. అప్పుడెప్పుడో పవన్ పై ఘాటు విమర్శలు చేసిన వైసీపీ అధ్యక్షుడు ఆ తర్వాత చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. కానీ నెల్లూరు సమరశంఖారావం సభలో మాత్రం జనసేనానిపై జగన్ నిప్పులు చెరిగారు.

చంద్రబాబుతో కలిసి ఏపీకి పవన్ వెన్నుపోటు పొడిచాడు
చాలా కాలం తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శల గన్ ఎక్కుపెట్టారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం చూసి మద్దతు ఇచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్... ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రశ్నిస్తానని చెప్పాడని ఇప్పుడు ఏమయ్యారని జగన్ ప్రశ్నించారు. వెన్నుపోటు దారుడైన చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తాను ఆంధ్రప్రజలకు వెన్నుపోటు పొడిచారని పవన్పై ఫైర్ అయ్యారు జగన్. ప్రత్యేక హోదా కోసం దేశం మొత్తాన్ని ఏకం చేస్తానన్న జనసేనాని అడ్రస్ లేరని జగన్ ఎద్దేవా చేశారు.

లగడపాటి లాంటి వారిని చంద్రబాబు తెరమీదకు తెస్తారు
ఇక చంద్రబాబు ఎన్నికల ముందు చాలా డ్రామాలాడుతున్నారని విమర్శించిన జగన్... ఈ ఎన్నికల్లో పోరాడబోతోంది ఎల్లో మీడియాతో మాయాగాడైన చంద్రబాబుతో అని అన్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు లగడపాటి లాంటి జిత్తులమారిని చంద్రబాబు ఎలాగైతే తెరపైకి తీసుకొచ్చారో... ఈ సారి జరగబోయే ఎన్నికల్లో కూడా లగడపాటిని పావుగా వాడుతారని ధ్వజమెత్తారు. ప్రజలు ఇలాంటి జిత్తుల మారిల నుంచి జాగ్రత్తగా ఉండాలని జగన్ పిలుపిచ్చారు. మండల స్థాయిలో బలమైన వైసీపీ నాయకులను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేస్తున్నాడని వారికి డబ్బులు ఎరచూపి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

నాలుగేళ్లు కాపురం... ఇప్పుడు మొసలి కన్నీరా..?
ప్రత్యేక హోదా పై మాట్లాడిన వైసీపీ అధ్యక్షుడు నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని జగన్ విమర్శించారు. నల్లచొక్కాలు ధరించి ఇప్పుడు పెద్ద నాటకానికే తెరతీశారన్నారు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు సాధిస్తే కేంద్రంలో ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు . ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు మోసం చేశాయని ధ్వజమెత్తిన జగన్... పూటకో మాట మారుస్తున్నచంద్రబాబును నమ్మొద్దని అన్నారు. ఇక ఓట్లు తొలగింపునకు చంద్రబాబు అండ్ టీమ్ పాల్పడుతూ ఆ నెపాన్ని మరొకరిపై వేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. దొంగే దొంగా దొంగా అన్న రీతిలో చంద్రబాబు వ్యవహారం ఉందని జగన్ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications