పవన్ కల్యాణ్ పవర్ను తక్కువ అంచనా వేస్తున్న జగన్: ఇలా పుల్ల విరుపు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత వైఎస్ జగన్..
హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి 'ప్రజా సంకల్ప యాత్ర'తో ప్రజలకు చేరువయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. వచ్చేనెల ఆరో తేదీ నుంచి ప్రారంభించే ఈ పాదయాత్రకు మద్దతు కూడగట్టేందుకు మీడియా సంస్థల అధినేతలు, సీఈఓలు, ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులతో వరుసగా సమావేశమవుతూ ముందుకు సాగుతున్నారు.
కానీ రాజకీయ పరిణతి సాధించడంలో వెనుకబడి ఉన్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ 'ప్రభావం' గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పాలిటిక్స్పై స్పష్టంగా పడింది.
చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్లోనూ అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. కేంద్రంలో బీజేపీని, ఏపీలో టీడీపీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. నాటి నుంచి వైఎస్ జగన్ ప్రతిస్పందించినప్పుడల్లా ముందుకొచ్చి ప్రజా సమస్యలపై స్పందిస్తూ అధికార టీడీపీని, సీఎం చంద్రబాబును వెనకేసుకొచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో అభిమానులు పుష్కలంగా ఉన్నారు.
2014లో పవన్ మద్దతుతో అధికారంలోకి టీడీపీ
2009 ఎన్నికల్లో కాపుల మద్దతుతో అధికారంలోకి రావడానికి ప్రజారాజ్యం పార్టీ పేరుతో ముందుకు వచ్చిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రయత్నించారు. కానీ 2014లో అన్న చిరంజీవికి ప్రతిగా పవన్ కల్యాణ్ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తాజాగా వైఎస్ జగన్.. 2013లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు అమలు చేసిన వైఖరినే అనుసరిస్తున్నారా? అని అనిపిస్తున్నది. నాడు కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మంత్రులుగా, ఎంపీలుగా ఉన్న వారు టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఇష్టం లేక వైఎస్ జగన్ వద్దకు రాయబారాలు నడిపారు. కొందరు స్వయంగా వెళ్లారు. కానీ వైఎస్ జగన్ మాత్రం అన్నీ తానే అన్నట్లు ఒంటెద్దు పోకడలు అనుసరించారు.
ప్రజలకు దగ్గరయ్యేందుకు జగన్ ఇలా
దీంతో రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి ‘సైకిల్' ఎక్కేశారు. కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ గూటికి చేరారు. మరో ఏడాదిన్నరలో మరోదఫా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ప్రజా సంకల్ప యాత్ర నిర్వహణ ద్వారా ప్రజలకు చేరువై... రాజకీయంగా అవసరమైన అన్ని వర్గాల వారితో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్.. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా పార్టీని విస్తరిస్తున్న పవన్ కల్యాణ్ ప్రాభల్యాన్ని గుర్తించనిరాకరిస్తున్నారా? అని అనిపిస్తున్నది.
పవన్ ఎలా పోటీ చేసినా జగన్కే సమస్య
‘సీఎం పదవి కోసం నేను, చంద్రబాబు పోరాడుతున్నాం. పవన్ కల్యాణ్ పూర్తిగా ఈ పోటీకి దూరం' అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా వైఎస్ జగన్ తన రాజకీయ జీవితాన్ని ఆత్మహత్యా సాద్రుశ్యంగా చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంఘటితం చేసుకోవడంలో విఫలం అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఏపీలో రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయడం, రెండోది టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాల్లోనూ వైఎస్ జగన్మోహన రెడ్డికి ప్రతికూల అంశాలే. పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ప్రజా వ్యతిరేక ఓటును చీల్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఒకవేళ పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తే యువత, కాపు సామాజిక వర్గం ఓట్లు సంఘటితంగా టీడీపీకి పడటంతో స్థూలంగా చంద్రబాబుకే లబ్ది చేకూరుతుంది. ఈ పరిణామాలను వైఎస్ జగన్ పరిగణనలోకి తీసుకోవడం లేదని రాజకీయ పరిశీలకులు తెలిపారు.