జగనన్న పచ్చ తోరణం .. మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో వనమహోత్సవంలో నేడు సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . పర్యావరణాన్ని పరిరక్షించడానికి, వాతావరణ సమతుల్యతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమానికి మంగళగిరి ఎయిమ్స్ వేదికగా బీజం పడనుంది.
డప్పు కొట్టి స్టెప్పులేసిన రోజా .. ఎమ్మెల్యే రోజా దరువుతో కళాకారుల్లో జోష్ !!
మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటనున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనం పెంపొందిస్తూ ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కొనసాగనుంది. జగనన్న పచ్చ తోరణంలో భాగంగా ప్రతి ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అటవీశాఖ, వన మహోత్సవం పేరుతో ఈసారి భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మొక్కలు నాటనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ఆవరణలో సీఎం జగన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించగానే, అన్ని జిల్లాల్లోనూ మంత్రులు ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా, 17 వేల వైయస్సార్ జగనన్న కాలనీలలో కూడా మొక్కలు నాటాలని సీఎం జగన్ ఆదేశించారు. రహదారులన్నీ పచ్చదనాన్ని పరుచుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం
వనమహోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పచ్చదనంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, దానిని ప్రధమ స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లుగా మంత్రి బాలినేని చెబుతున్నారు. ఇక నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు పాఠశాలలోనూ, ఆసుపత్రుల లోనూ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
Recommended Video
మంగళగిరి ఎయిమ్స్ లో రెండు వేల మొక్కలు నాటే కార్యక్రమం
ఈ రోజు జగన్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఉన్న నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీరంగనాథ రాజు, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఇదే సమయంలో మంగళగిరి ఎయిమ్స్ లో ఈరోజు జరగనున్న కార్యక్రమంలో రెండువేల మొక్కలను నాటనున్నారు.వృక్షో రక్షతి రక్షితః అంటారు. అటువంటి వృక్షాలను మనం కాపాడితే, అవి మనల్ని కాపాడతాయి.మన భావి తరాలను కాపాడతాయి ఇదే నినాదంతో జగనన్న పచ్చ తోరణానికి శ్రీకారం చుట్టారు.