జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్లు: పాతవన్నీ తిరగతోడుతూ, ఏపీలో కొత్త దుమారం!!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రభుత్వ స్థలాల్లో గృహాలు నిర్మించుకొని, గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొందిన లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పించడం కోసం రూపొందించబడింది. కానీ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో అర్హుల గుర్తింపు ప్రక్రియ గందరగోళంగా తయారైంది. స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుని, గత ప్రభుత్వాల హయాంలో గృహనిర్మాణానికి లబ్ధి పొందినవారు పాతవన్నీ తిరగ తోడుతూ ఏపీ సర్కార్ షాక్ ఇస్తూ ఉండటంతో ఆందోళనకు గురవుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో తీసుకున్న గృహ రుణాలు చెల్లించాలని అధికారులు తిరుగుతున్న క్రమంలో గ్రామాలలో గందరగోళం నెలకొంది.

1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ రుణం పొందిన వారికి పథకం
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాలలో గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి రుణాలు తీసుకోకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా ప్రభుత్వం ఉచితంగా యాజమాన్య హక్కులు కల్పించనుంది. ఇంతవరకు బాగే ఉన్నా అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వాళ్ళు, ఆ ఇంటికి సంబంధించిన రిజిస్టర్డ్ పత్రాలు లేని వాళ్లకు ఈ పథకం లబ్ది చేకూరిస్తే మంచిదే కానీ సొంత స్థలాలు ఉండి ప్రభుత్వ సహాయంతో హౌసింగ్ లోన్ తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వాళ్లకు సైతం సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగస్వాములను చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం చాలా గ్రామాలలో ప్రజల ఆగ్రహానికి కారణంగా మారింది.

గతంలో తీసుకున్న గృహ రుణాల లెక్కలు .. స్కీం కోసం నగదు చెల్లింపులు...లబ్దిదారులకు షాక్
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో బద్వేల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండగా, కడప జిల్లా ను మినహాయించి మిగిలిన 12 జిల్లాలకు సంబంధించి గతంలో వివిధ ప్రభుత్వాల హయాంలో లబ్ధిపొందిన 47 లక్షల 37 వేల 499 మంది లబ్ధిదారుల వివరాలను మునిసిపాలిటీలు, పంచాయతీలకు గృహ నిర్మాణ శాఖ బదిలీ చేసింది. గత ప్రభుత్వాల హయాంలో తీసుకున్న గృహ రుణాలకు సంబంధించిన లెక్కలను చెప్పి ప్రభుత్వం వల్ల స్థలం వచ్చినట్టుగా, ప్రభుత్వం వల్లే ఇళ్లు నిర్మించుకున్నట్టుగా చెబుతూ, గ్రామీణ ప్రాంతాలలో అయితే రుణ గ్రహీతలు 10000, మునిసిపాలిటీలలో అయితే రుణ గ్రహీతలు 15,000, కార్పొరేషన్ల పరిధిలో 20000 చెల్లిస్తే జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద ఆ ఇల్లు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెబుతుండడం సొంత స్థలాలలో ఇల్లు కట్టుకున్న వారికి ఆగ్రహం తెప్పిస్తుంది.

తమ పేరు మీద ఉన్న ఇళ్ళపై మళ్ళీ రిజిస్ట్రేషన్ దేనికి అంటూ లబ్దిదారుల అసహనం
గత ప్రభుత్వాల హయాంలో తీసుకున్న గృహ రుణాలను ఈ ప్రభుత్వం చెల్లించమని అడుగుతున్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన లోన్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. తమ పేరు మీద ఉన్న స్థలాలను, మళ్లీ తమ పేరు మీదే ఎందుకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో మరిచిపోయిన గృహ రుణాలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారంటూ, డబ్బులు వసూలు చేయడానికే ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పెట్టారంటూ మండిపడుతున్నారు.

గతంలో లోన్స్ తీసుకున్న వారిళ్ళకు వెళ్లి షాక్ ఇస్తున్న అధికారులు
ప్రస్తుతం రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ అధికారులు జగనన్న గృహ హక్కు పథకం లబ్ధిదారుల క్షేత్రస్థాయి పరిశీలనలో బిజీగా ఉన్నారు. గతంలో మీరు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి రుణం తీసుకున్నారా? మీ ఇంటి స్థలం స్వభావం ఏమిటి? ప్రస్తుత గృహానికి అనుభవ దారుడు ఎవరు? వంటి అనేక వివరాలను అడుగుతూ, అప్పుడు మీరు లోన్ తీసుకున్నారు కాబట్టి, మీ పేరు మీద ఈ ఇంటికి హక్కు కల్పించేలా జగనన్న గృహ హక్కు పథకాన్ని తీసుకు వచ్చామని, అందుకోసం మీరు డబ్బులు చెల్లించాలని విలేజ్ వాలంటీర్లు, విఆర్వో, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారుల జాబితాలతో ఇల్లిల్లూ తిరుగుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తమ ఇల్లు ఏమైపోతుందో అన్న భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం చెల్లిస్తేనే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కన్నా వాస్తవ లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు బకాయి ఉన్న రుణం తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. లేదంటే ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సిందే. అలా చెల్లిస్తేనే ఆ ఇంటిని వారి పేరుమీద బదలాయిస్తారు. ఇక వాస్తవ లబ్ధిదారుల నుండి ఇల్లు కొనుగోలు చేసిన వారికి, వారి వారసులకు గ్రామీణ ప్రాంతాలలో అయితే 20,000 మునిసిపాలిటీలలో అయితే 30000, కార్పొరేషన్లలో 40 వేల రూపాయలు చెల్లిస్తే పూర్తి యాజమాన్య హక్కులు దక్కుతాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఇదో కొత్త సమస్య అంటూ చాలామంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

గతంలో లోన్లను ఇప్పుడు చెల్లించాలని చెప్పటంతో లబోదిబోమంటున్నలబ్దిదారులు
అప్పుడు ఇచ్చిన లోన్ లకు, ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ లబోదిబోమంటున్నారు. ఆ డబ్బులు చెల్లించకుంటే తమ ఇంటి పరిస్థితి ఏంటి అన్న ఆందోళనలో ఉన్నారు. కేవలం డబ్బుల కోసం జగన్ సర్కార్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వ భూములలో ఇల్లు ఉన్న వారికి, ప్రభుత్వం నుండి లబ్ది పొందిన నిరుపేదలకు న్యాయం చెయ్యాలంటే జగన్ ఉచితంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అందించాలి కానీ ఇలా కాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications