డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా.!వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఖాతాలు ఖాళీ.!మండిపడ్డ లోకేష్.!
అమరావతి/హైదరాబాద్ : డ్వాక్రా అక్కా చెల్లెళ్లమ్మలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డ్వాక్రా మహిళలకే టోకరా వేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. దశాబ్దాల క్రితం కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు వన్టైమ్ సెటిల్మెంట్ అంటూ ఒక్కొక్కరి నుంచీ బలవంతంగా పదివేలు వసూలు చేయడం, ఎవరైనా కట్టకపోతే వారి కుటుంబసభ్యుల పింఛన్లు ఆపేస్తామని బెదిరించడం, ఆ ఇంట్లో డ్వాక్రా మహిళల ఖాతాల నుంచి నిధులు మినహాయించుకుంటున్న నారా లోకేష్ ఘాటుగా విమర్శించారు.
సీఎం జగన్ కబంధహస్తాల్లో చిక్కిన అభయహస్తం..మహిళలను దోచేస్తున్న ప్రభుత్వమన్న లోకేష్
అధికారంలోకి రాకముందు మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యమని ఇప్పుడు మహిళల్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపి అరాచక ప్రభుత్వ చర్యలని ఖండిస్తూ నారా లోకేష్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డ్వాక్రా మహిళలకు అభయంగా నిలిచిన అభయహస్తం జగన్ కబంధహస్తాల్లో చిక్కి పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయని లోకేష్ పేర్కొన్నారు. మహిళలు రూపాయి రూపాయి కూడబెట్టి అభయహస్తం పథకం కోసం ఎల్ఐసీలో దాచుకున్న రెండు వేల కోట్లు మళ్లించుకున్న జగన్ సర్కారు, ఎల్ఐసీని పథకం నుంచి వారిని తప్పించడం పథకం ప్రకారం చేసిందేనని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి మహిళల్ని మోసగించారన్నారు.. ధ్వజమెత్తిన నారా లోకేష్
మాయం చేసిన డ్వాక్రా ఈ సొమ్మంతా జగన్ సర్కారు స్వాహా చేసిందని నారా లోకేష్ ఆరోపించారు. అభయహస్తం పథకం ప్రారంభమైన నాటి నుంచి 34 లక్షలకు పైగా పొదుపు మహిళలు క్రమం తప్పకుండా ప్రీమియమ్ చెల్లించారన్నారు. ఈ పథకం కింద 60 ఏళ్లు దాటిన 4 లక్షలమందికి పైగా మహిళలకు ఎల్ఐసీ 500 నుంచి 2200 రూపాయల వరకూ నెలవారీ పెన్షన్ వస్తోందని, ఈ ఆసరా లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి మహిళల్ని మోసగించారన్నారు. ఇప్పుడు ఓటిఎస్ పేరుతో మరో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు ఘాటుగా విమర్శించారు. 1983 నుంచి వివిధ ప్రభుత్వాలు పేదలకు నిర్మించి ఇచ్చిన ఇళ్లకు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో 1500 కోట్ల రూపాయల దోపిడీకి ప్లాన్ చేశారని లోకేష్ ఆరోపించారు.
జగన్ సర్కారు కాల్ మనీ మాఫియా.. మహిళలు భయపడొద్దన్న లోకేష్
ఓటీఎస్ కోసం 10 వేల రూపాయలు చెల్లించకపోతే పెన్షన్ ఆపుతామని, రేషన్కార్డు తీసేస్తామని, పథకాలకు అనర్హులను చేస్తామని నియంతలను తలపించే విధంగా బెదిరించడం మానుకోవాలన్నారు. ఓటీఎస్ స్వచ్ఛందమైనప్పుడు ఈ బెదిరింపులు ఎందుకని ప్రశ్నించారు. ఒక్కరు కూడా ఓటీఎస్ కట్టేందుకు ముందుకు రాకపోవడంతో జగన్ సర్కారు కాల్ మనీ మాఫియా అవతారమెత్తిందన్నారు. ఓటిఎస్ డబ్బు చెల్లించకపోతే, లబ్ధిదారుల కుటుంబ సభ్యుల డ్వాక్రా పొదుపు సొమ్ము జమ చేసుకుంటామనడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. పొదుపు సంఘాల లీడర్లను వెంటపెట్టుకుని స్వయంగా అధికారులు బ్యాంకులకు వెళ్లడం పొదుపు సొమ్ము ఖాళీ చేసి ఓటిఎస్ కి చెల్లించడం మహిళల్ని వంచించడమేన్నారు నారా లోకేష్.
Recommended Video
వన్టైమ్ సెటిల్మెంట్ ఎవ్వరూ కట్టొద్దు.. టీడిపి వస్తే ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తామన్న లోకేష్
ప్రభుత్వం అనాలోచిత వైఖరి వలన డ్వాక్రా సంఘాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు దొరక్క ప్రభుత్వం పొదుపు ఖాతాలు ఖాళీ చెయ్యడం వలన డ్వాక్రా గ్రూపుల భవిష్యత్తు అంధకారం కానుందని హెచ్చరించారు. మహిళా సాధికరతకి, స్వావలంబనకి దిక్సూచిలాంటి డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేసే ఇటువంటి దందా వ్యవహారాలను ప్రభుత్వం ఆపాలన్నారు. అరవై ఏళ్లు దాటిన మహిళలకు వరంలాంటి అభయహస్తం పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు లోకేష్. ఓటీఎస్ ఎవ్వరూ రూపాయి కట్టొద్దని, ఓటీఎస్ కింద పొదుపు ఖాతాల నుంచి జమ వేసుకునే చర్యలను మహిళలంతా సంఘటితమై అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.