మా పాత్ర లేదు: జగతి, వాన్పిక్పై ఏపీ ప్రభుత్వం దృష్టి
దీనిపై బుధవారం సంస్థ సభ్యుడు ముఖేశ్ కుమార్ ఎదుట జగతి పబ్లికేషన్స్, వాన్పిక్కు చెందిన న్యాయవాదులు వాదనల్ని వినిపించారు. వాన్పిక్కు భూకేటాయింపులలో తమ పాత్రేమీలేదని, తమకు లబ్ధి చేకూరిందన్న ఈడీ తగిన ఆధారాలు చూపించాలని జగతి పబ్లికేషన్స్ న్యాయవాదులు అన్నారు. ప్రాజెక్టు వల్ల తాము ఎంతగానో నష్టపోయామని, తమకు లబ్ధి జరిగిందని ఈడీ వాదించటం సరికాదని వాన్పిక్ సంస్థ తరపు న్యాయవాదులు చెప్పారు. గురువారం ఈడీ వాదనలు వినిపించనుంది.
వాన్పిక్ పైన ఏపీ సర్కారమ సమాలోచన
వైయస్ హయాంలో కేటాయించిన వాన్పిక్ భూముల విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయమై ఏపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. ఇప్పటికే ఈ భూముల వ్యవహారంపై మంత్రుల కమిటీని నియమించిన ప్రభుత్వం వాన్పిక్ విషయంలో ప్రత్యేకంగా అధికారుల కమిటీని వేసింది.
ఈ కమిటీ బుధవారం సచివాలయంలోని నార్త్హెచ్ బ్లాక్లో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి డి సాంబశివరావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ, న్యాయశాఖ కార్యదర్శితో సమావేశమైంది. ఈ సమావేశంలో వాన్పిక్ భూములను కట్టబెట్టడంలోనూ, ఒప్పందాలు చేసుకోవడంలోనూ పలు ఉల్లంఘనలున్నాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ప్రధానంగా వాన్పిక్ భూములు అప్పగించేందుకు కేబినెట్లో తీసుకున్న నిర్ణయానికి, ఆ తర్వాత చోటుచేసుకున్న వ్యవహారాలకూ పొంతన లేదన్న అభిప్రాయానికి వచ్చారు. మంత్రివర్గ సమావేశ నిర్ణయానికి, వాన్పిక్ ఒప్పందాలకూ వ్యత్యాసముందన్న నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి 18వేల ఎకరాలకు పైగా భూమిని కట్టబెట్టినప్పుడు అందుకు అనుగుణమైన పర్యవేక్షణ జరిగిందా? లేదా? అన్న దానిపై జిల్లాస్థాయి నుంచి నివేదికలు కోరాలన్న అభిప్రాయానికి వచ్చారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వాస్తవ పరిస్థితి తెలియజేసే నివేదికను తీసుకోవాలని నిర్ణయించారు. కొంత భూమిని అసైన్డ్ ల్యాండ్గా గుర్తించారు. ఆ భూమి యజమానులకు వాన్పిక్ సంస్థ నగదు చెల్లించిందా? లేదా? అన్న సందేహాలు నివృత్తి కావాల్సి ఉందని భావిస్తున్నారు. వాన్పిక్తో చేసుకున్న ఒప్పందాలతోసహా, ప్రభుత్వ ఉత్వర్వు జీవోనెం.30 జారీలోనూ లోపాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.