ఏపి మంత్రులకు జగ్గీవాసుదేవ్ యోగా క్లాసులు: మెరుగు కోసమన్న బాబు
హైదరాబాద్: పని తీరు మెరుగు కోసమే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సద్గురు జగ్గీ వాసుదేవ్తో యోగా క్లాసులు ఇప్పిస్తున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో ‘ఇన్నర్ ఇంజినీరింగ్ జాయ్ఫుల్ లివింగ్' కార్యక్రమం గురువారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి సిఎం చంద్రబాబునాయుడుతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజులపాటు ఈ యోగా క్లాసులు జరగనున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంతకుముందు ఎవరూ ఇలాంటి కార్యక్రమం చేయలేదని, ఇదొక వినూత్న కార్యక్రమమని చెప్పారు.
ఒత్తిడిని, క్రైసెస్ను సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే ఇలాంటి యోగా కార్యక్రమాలు అవసరమని చంద్రబాబు తెలిపారు. ఇన్నర్ ఇంజినీరింగ్ జాయ్ ఆఫ్ లివింగ్ తరగతులు ఏకాగ్రతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. స్ట్రెస్ మేనేజ్మెంట్తో ప్రశాంతత పెరుగుతుందని తెలిపారు. యోగాతో ఉబ్బసం, బిపి, లాంటి వ్యాధులు కూడా నయమవుతాయని చెప్పారు. వ్యక్తి పని తీరు మెరుగుపడుతుందని అన్నారు.
బయటి ప్రపంచానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడినట్లే.. మన శరీరం లోపల ఆరోగ్యానికి యోగా అవసరమని ఆయన తెలిపారు. ఈషా ఫౌండేషన్ అనేక గొప్ప కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా యోగా ప్రాధాన్యతను వివరించారని, ఐక్యరాజ్య సమితి కూడా యోగాను గుర్తించిందని చంద్రబాబు తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఈషా ఫౌండేషన్ను ప్రత్యేక సలహాదారుగా నియమించుకుందని తెలిపారు.
కార్పొరేట్ సెక్టార్లలో యోగా, మెడిటేషన్ లాంటి వాటికి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. వీటి వల్ల వ్యక్తుల్లో చురుకుదనం పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు. 1992లో తమిళనాడులో ఏర్పాటైన ఈషా ఫౌండేషన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తోందని తెలిపారు.
పనితీరు మెరుగుపర్చుకోవడం కోసమే ఈ యోగా కార్యక్రమమని చంద్రబాబు చెప్పారు. మూడు రోజులపాటు మంత్రులు, అధికారులు యోగా క్లాసుల్లో ఉండటం వల్ల ప్రభుత్వ సమయం వృథా అవుతుందని కొందరు ఆరోపిస్తున్నారన్న చంద్రబాబునాయుడు, అలా ఏం జరగదని చెప్పారు. దావోస్లో ఎవరు మాట్లాడినా భవిష్యత్ భారతదేశానిదేనని చెప్పారని సిఎం చంద్రబాబు తెలిపారు.