సంగారెడ్డి నుండే: పద్మినికి జగ్గారెడ్డి, టిపై మారేది లేదని..
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పైన స్పందించేందుకు ఆయన నిరాకరించారు. తాను ఇప్పటికీ రాష్ట్ర సమైక్యతనే కోరుకుంటున్నానని తెలిపారు. రాష్ట్రం విడిపోయినా తన అభిప్రాయం మారదని చెప్పారు. తాను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీ చేస్తానని, అదీ కాంగ్రెసు పార్టీ నుండి బరిలోకి దిగుతానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో కొందరికి రాజకీయ ప్రయోజనమే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అమరవీరులకు అవసరమైతే తమ జిల్లాలో భూమి ఇచ్చేందుకు సిద్ధమన్నారు. మొదట విలీనంకు మద్దతు ప్రకటించిన తెరాస ఇప్పుడు దొంగ మాటలతో డ్రామాలాడుతోందన్నారు.
కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తే తెరాసకే మంచిదన్నారు. కోదండరామ్ అమరవీరుల జాబితాను ఇస్తే కుటుంబాలకు ఇళ్లు ఇప్పిస్తానని చెప్పారు. తాను సమైక్యవాదినే అయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ ఆదేశిస్తే కెసిఆర్ పైన పోటీ చేస్తానన్నారు. సంగారెడ్డిలో తనను ఓడించే వారే లేరన్నారు.
చిన్నమ్మను మరువొద్దు: నాగం
భారతీయ జనతా పార్టీ సహకారం వల్లనే తెలంగాణ ఏర్పడిందని బిజెపి నేత, నాగర్ కర్నూలు శాసన సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. చిన్నమ్మ సుష్మా స్వరాజ్ను తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దన్నారు.
రాష్ట్రపతి పాలనపై దానం, పొన్నం
ఎపిలో రాష్ట్రపతి పాలన సరైన నిర్ణయమని దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్యలు అన్నారు. రెండు ప్రాంతాల నేతలతో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇరు ప్రాంతాల నాయకులతో చర్చించారని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రపతి పాలనపై షబ్బీర్
రాష్ట్రపతి పాలనను స్వాగతిస్తున్నామని షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి నష్టమైన కాంగ్రెసు తెలంగాణను ఇచ్చిందన్నారు.