జగ్గంపేట జనం జగన్ తోనే... ఝడుసుకుంటున్న జ్యోతుల...
వైసిపీ అదినేత జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర రాజకీయంగా కీలక మలుపులు తిరుగుతోంది. వైసీపి సింబల్ మీద గెలిచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న నేతలను జగన్ పాద యాత్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పార్టీ మారిన నేతల పట్ల జగన్ వెల్లడిస్తున్న అభిప్రాయాలతో ఆత్మరక్షణలో పడుతున్నారు నాయకులు. తాజాగా జగ్గంపేట లో పర్యటించిన జగన్ ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పట్ల చేసిన కామెంట్లు సదరు ఎమ్మెల్యేకి నిద్రపట్టని రాత్రులను మిగిల్చినట్టు ప్రచారం జరుగుతోంది. జగ్గంపేటలో జగన్ వాఖ్యలను నరనరాన జీర్ణించుకున్న జగ్గంపేట ప్రజలు జ్యోతుల నెహ్రూకి చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. జగ్గంపేటలో ప్రజలందరూ జ్యోతుల నెహ్రూ వెంటే ఉంటారని చెప్తుండగా, జగన్ సభకు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరై జ్యోతులకు షాక్ ఇచ్చారట. దీంతో జ్యోతుల నెహ్రూ నష్ట నివారణ చర్యల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది.

నమ్మిన అనుచరులు జగన్ సభలో ప్రత్యక్షం.. షాక్ లో జ్యోతుల నెహ్రూ..
రాజకీయాల్లో నేటి మిత్రులు రేపటికి శత్రువులు కావొచ్చు. నేడు పక్కపక్కన కూర్చున్న వారు రేపు ఎదురు పడే పరిస్తితి కూడా లేకుండా పోవచ్చు. ఇలా ఉంటాయి రాజకీయాలు. వైసీపీ తరఫున గెలిచి, జగన్కు అన్ని విధాలా అండదండగా ఉంటానని మాటిచ్చి, అసెంబ్లీలో చంద్రబాబును ఏకేసిన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. పట్టుమని రెండేళ్లు కూడా తిరగకుండానే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పంచన చేరిపోయారు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ రాత్రికి రాత్రే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Recommended Video


జగన్ చేసిన డ్యామేజ్ పై జ్యోతుల నష్టనివారణ చర్యలు..
వాస్తవానికి పీఏసీ చైర్మన్ పదవిని జ్యోతులకు ఇవ్వాలని జగన్ భావించారు. అయితే, ఆయన టీడీపీలో చేరే సరికి జగన్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. తనకు వెన్నుపోటు పొడిచినప్పటికీ.. జగన్ ఏనాడూ జ్యోతులపై విరుచుకు పడలేదు. అన్న.. అన్న అంటూనే ఆయనను సంభోదించాడు. అయితే, తాజాగా జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చేరుకున్నాక.. వాస్తవానికి ఈ నియోజకవర్గం తన షెడ్యూల్లో లేకపోయినా.. జగన్.. చివరి నిముషంలో దీనిని తన షెడ్యూల్లో చేర్చుకున్నారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకోవడం వెనుక జగన్కు రెండు వ్యూహాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది.

జగ్గంపేటలో జగన్ కు జన నీరాజనం..జగన్ కు జై కొట్టిన జ్యోతుల వర్గం..
వాటిలో ఒకటి నెహ్రూకు తన బలం ఏమిటో చూపించడం, రెండు కాపు లు తన వెంటే ఉన్నారని నిరూపించడం. ఈ రెండు విషయాల్లోనూ జగన్ సక్సెస్ అయ్యాడు. పాదయాత్రంలో 100 వ నియోజకవర్గం జగ్గంపేటలో జగన్ పాదయాత్ర బహిరంగ సభ భారీగా జరిగింది. జనసందోహం మధ్య జగన్ స్పీచ్ అదరగొట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కంచుకోట కూలిపోయేలా వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈ సభకు వచ్చిన జనసందోహం చూసి నెహ్రూకు టెన్షన్ పెరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. తాను పార్టీలో అంతగా నమ్మి పదవి ఇచ్చినా ఆయన తనని కాదని పార్టీమారారు అని జగన్ విరుచుకుపడ్డారు.

జగ్గంపేట లో జగన్ స్పూర్తిదాయక ప్రసంగం.. కేరింతలు కొట్టిన జనం..
వైసీపీ ఎమ్మెల్యేలను అధికార పార్టీ అధినేత 25 నుంచి 30 కోట్ల రూపాయలను ఇచ్చి కొనుగోలు చేశారని, అందులో ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నారని జ్యోతులపై జగన్ విరుచుకుపడ్డారు. నైతిక విలువలులేని ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడని పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు., ఈ పరిణామాలు జ్యోతులను తీవ్రంగా కలచి వేస్తున్నాయి. తన నియోజకవర్గంలో జగన్కు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది ? అని ఆయన తల పట్టుకుంటున్నారట. తన సొంత అనుచరులుగా ముద్ర పడ్డ వాళ్లు కూడా జగన్ బహిరంగ సభకు హాజరవ్వడాన్ని జ్యోతుల తీవ్రంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జగన్ వాఖ్యలను లోతుగా అర్థం చేసుకున్న జగ్గంపేట ప్రజలు రాబోవు రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న అంశం పై జ్యోతుల కోటరీలో ఉత్కంఠ నెలకొంది. అలాగే రాబోయే ఎన్నికల్లో జ్యోతులకు ప్రజలు ఎలాంటి సఘీభావం ప్రకటిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications