వారిది సైంధవ పాత్ర, అడ్డొస్తే వారికే కష్టం: జైపాల్ రెడ్డి
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీమాంధ్ర నాయకులు సైంధవ పాత్ర పోషించాలని చూస్తున్నారని, తెలంగాణ జగన్నాథ రథచక్రాలు కదిలాయని, దానికి అడ్డు వస్తే వారికే నష్టమూ కష్టమని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. వరంగల్లో జరిగిన కాంగ్రెసు జైత్రయాత్ర సభలో ఆయన శనివారం సాయంత్రం ప్రసంగించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చింది గానీ తోక మిగిలి ఉందని, హైదరాబాదును తటస్థ అధికారి చేతిలో పెట్టాలనే డిమాండ్ ఆ తోక అని ఆయన అన్నారు.
భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని ఆయన చెప్పారు. భద్రాచలం సీమాంధ్రలోకి వెళ్లకుండా తాను ప్రయత్నాలు చేస్తానని ఆయన చెప్పారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల తీరును ఆయన తప్పు పట్టారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెసు జాప్యం చేస్తోందంటూ ఆ రెండు పార్టీలు విమర్సిస్తూ వచ్చాయని, నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంత తొందర ఎందుకని అంటున్నారని ఆయన అన్నారు. ఇందిర గాంధీ తెలంగాణ ఇవ్వలేదు, సోనియా గాంధీ ఇచ్చారని అంటున్నారని, అది సరైంది కాదని అంటున్నారని, చరిత్ర పుటలు తిరిగేస్తే అసలు విషయం అర్థమవుతుందని ఆయన అన్నారు.
ఏ ఉద్యమమైన ఫలితాలు సాధించాలంటే కొంత కాలం పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దూషిస్తున్నారని, రాజకీయాల కోసం ఏదైమా మాట్లాడవచ్చునా అని, మాట ఇచ్చిన తర్వాత తప్పే నైజం సోనియా గాంధీకి లేదని ఆయన అన్నారు. 2004లోనే ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష ఉందని గుర్తించి సోనియా గాంధీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేళ్లు తాను ఓర్పుతో, నేర్పుతో, అల్లరి పెట్టకుండా, సొంత నియోజకవర్గం కూడా తిరగకుండా తెలంగాణ కోసం పనిచేశానని ఆయన చెప్పుకున్నారు.

నెహ్రూ పంజాబ్ రాష్ట్ర ఏర్పాటు వద్దన్నారని, పంజాబ్ ఇవ్వలేదని, ఆ తర్వాత నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ 1966లో పంజాబ్ రాష్ట్రం ఇచ్చారని, అంత మాత్రాన నెహ్రూపై ఇందిరా గాంధీకి భక్తి, పితృవాత్సల్యం లేదని అనుకోవాలా అని, ఒక చారిత్రక సందర్భంలో మార్పులను గుణాత్మకంగా అర్థం చేసుకున్నవారే రాజకీయ నాయకులు అవుతారని, అలాంటి రాజకీయ నేత సోనియా గాంధీ అని ఆయన అన్నారు. కొన్ని షరతులతో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారని, ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెసు పార్టీ ఇప్పుడు వ్యవహరించిందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ప్రజల విజయం మాత్రమే కాదు, ప్రజాస్వామిక విలువల విజయం కూడా అని ఆయన అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీని గౌరవిస్తున్నాం, అభినందిస్తున్నామని ఆయన అన్నారు. అలాంటి నాయకురాలికి కొంత మంది సమాధులు కడుతున్నారని, దానికి అక్కడి ప్రజలే సమాధానం చెప్తారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల విజయం మాత్రమే కాదు, ప్రజాస్వామిక విలువల విజయం సిడబ్ల్యుసి నిర్ణయం తర్వాత చెప్పాం. 60 ఏళ్ల ఆకాక్షను గౌరవిస్తున్నాం, అభినందిస్తున్నాం. అలాంటి నాయకురాలికి కొంత మంది సమాధులుకడుతున్నారు. అక్కడి ప్రజలే సమాధానం చెప్తారు. దశాబ్దాల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని ఆయన అన్నారు. సిడబ్ల్యుసి తీర్మానం శిలాశాసనమని ఆయన అన్నారు. సిడబ్ల్యుసి తీర్మానం వేరు, మంత్రి వర్గ తీర్మానం వేరని ఆయన అన్నారు.
ఉద్యోగాలకు తెలంగాణ బిడ్డలు దూరమయ్యారని రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని, ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశమే దానికి సంకేతమని ఆయన అన్నారు. తెలంగాణలోని సీమాంధ్రులకు భయం అక్కరలేదని ఆయన అన్నారు. ఇది సంబరాల సభ కాదని, సమరాంతం సభ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications