వ్యాపారం కోసం: లగడపాటిపై జైరాం, సెప్టెంబర్లో రాజధాని
ఒంగోలు: లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావులు తమ తమ వ్యాపారాల కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించారని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ బుదవారం నిప్పులు చెరిగారు. ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
గతంలో కొత్త రాష్ట్రాలకు ఎలాంటి ప్యాకేజీలు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు సీమాంధ్రకు మాత్రం లక్షా యాభైవేల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. తాను ఒక ప్రాంతానికి ఏజెంటును అయినట్లు కొంతమంది మాట్లాడటం విడ్డూరమని అభిప్రాయపడ్డారు. తాను ఏ ప్రాంతానికి ఏజెంటును కాదని, తెలుగు ప్రజల ఏజెంటునని వ్యాఖ్యానించారు.
విభజనను కిరణ్ కుమార్ రెడ్డి తప్ప మిగతా మంత్రులు అందరూ అంగీకరించారని చెప్పారు. లగడపాటి, రాయపాటిలు తమ వ్యాపారాల కోసమే వ్యతిరేకించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన జైరామ్ రమేష్ మండిపడ్డారు.
ఆయన తన స్వప్రయోజనాల కోసం కొత్త పార్టీని పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన లాంటి వారి కాంగ్రెసు పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు. సెప్టెంబరులో సీమాంధ్రకు కొత్త రాజధాని ప్రాంతాన్ని ప్రకటిస్తామని చెప్పారు. గుంటూరు, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. కాగా, జైరామ్ రమేష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.