కెసిఆర్ను ఓడించేందుకు జైరాం పావులు, అభ్యర్థితో భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న గజ్వేల్ ఎమ్మెల్యే నర్సా రెడ్డితో కేంద్రమంత్రి జైరాం రమేష్ బుధవారం సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. బుధవారం రాత్రి హైదరాబాద్కు వచ్చిన జైరాం ప్రొటోకాల్ ఇంచార్జ్ వేణుగోపాల్తో కలిసి ఒక ప్రైవేటు హోటల్లో దిగారు.
అక్కడికి గజ్వేల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నర్సారెడ్డిని పిలిపించుకున్నారు. ఈ స్థానం నుంచి కెసిఆర్ పోటీ చేస్తుండటంతో అక్కడి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో గత ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యాక్రమాలు, తెలంగాణ సాధనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సాగించిన పోరు తదితర అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

అదే సమయంలో రాజకీయంగా కెసిఆర్ను ఓడించేందుకు అవసరమైన వ్యూహాలపై కూడా జైరాం దృష్టి సారించారు. గతంలో ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ వాదం వీగిపోతుందేమోననే భయంతో దాదాపు అన్ని పార్టీలు తెరాసకు మద్దతు ఇచ్చాయని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలకు టిక్కెట్ ఇవ్వడం వల్ల నర్సంపేట స్థానాన్ని కోల్పోయిన దొంతి మాధవ రెడ్డి, కంటోన్మెంట్ సీటు దక్కించుకొని చివరి నిమిషంలో గజ్జెల కాంతానికి ఆ సీటు కోల్పోయిన విద్యార్ధి నేత క్రిశాంత్తో జైరాం సమావేశమయ్యారు. గురువారం తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో జైరాంకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications