విభజన: మంచి సూచనలిచ్చారని జెపికి జైరాం కితాబు
హైదరాబాద్/న్యూఢిల్లీ: లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్కు ఫోన్ చేసి మరీ కేంద్రమంత్రి జైరాం రమేష్ అభినందించారు. రాష్ట్ర విభజన సమస్య పరిష్కారానికి మంచి సూచనలు చేసినందుకు ఆయనకు జైరాం రమేష్ కితాబిచ్చారు. మీరు చెప్పిన రీతిలోనే సమస్యకు పరిష్కారం చూపుతున్నామని జయప్రకాష్ నారాయణ్కు జైరాం తెలిపారు. ఈ నేపథ్యంలో లోక్సత్తా పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయానికి ముందు జయప్రకాష్ నారాయణ్కు ఫోన్ చేసిన జైరాం ఆయనతో మాట్లాడారు. మీరేం చెప్పారో అదే చేస్తున్నామని జైరాం ఆయనకు చెప్పినట్లు సమాచారం. రాయలసీమ ప్రాంతానికి రెవెన్యూ లోటు పూడ్చేందుకు, పన్నుల రాయితీని కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని జైరాం ఆయనకు చెప్పినట్లు తెలిసింది. అదే విధంగా ఉత్తరాంధ్రకు కూడా తగిన విధంగా ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.

పోలవరం ముంపు ప్రాంతాల ప్రయోజనాల్ని కాపాడేందుకు చేసిన సూచనలు, సమస్య పరిష్కారానికి ఎంతో తోడ్పడ్డాయని జెపికి జైరాం చెప్పినట్లు తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని జెపి కోరగా.. రాష్ట్రాలకు మాత్రమే ఉండే ఆ హోదాను రాష్ట్రంలో ఉండే ఒక ప్రాంతానికి ఇవ్వడం వీలు కాదని జెపికి జైరాం వివరించినట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పాటు అనివార్యమని, అయితే విభజన సమస్యను సామరస్యంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా పరిష్కరించాలని రాష్ట్ర శాసనసభ సమావేశాల్లోనూ జయప్రకాష్ నారాయణ కోరిన విషయం తెలిసిందే.
రాయలసీమ రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని జయప్రకాష్ నారాయణ గతంలోనూ కేంద్రాన్ని కోరిన విషయం తెలిందే. అంతేగాక ఉత్తరాంధ్ర ప్రాంతానికి నిధుల కేటాయింపు, పోలవరం నిర్మాణం, కొత్త నౌకాశ్రయం, హైదరాబాద్లోని సీమాంధ్రులకు రక్షణ మొదలగు అంశాలపై ప్రతిపాదనలను జెపి కేంద్రానికి సూచించారు. కాగా జెపి సూచనలు కేంద్రం పరిగణలోకి తీసుకోవడం పట్ల లోక్సత్తా పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications