టి 60 ఏళ్లది, సీమాంధ్రకు ఇవి చేస్తాం: సీమలో జైరామ్
చిత్తూరు: తెలంగాణ ఉద్యమానికి అరవయ్యేళ్ల చరిత్ర ఉందని కేంద్రమంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్ బుధవారం అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన తర్వాత సీమాంధ్రకు ఏం చేస్తుందో ఆయన వివరించారు. తెలంగాణ పైన కాంగ్రెసు పార్టీ హడావుడిగా నిర్ణయం తీసుకోలేదన్నారు. విభజన విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసిందన్నారు.
రాజ్యాంగం ప్రకారమే తాము రాష్ట్రాన్ని విభజించామని చెప్పారు. తమకు రాజ్యాంగం తెలుసునని వ్యాఖ్యానించారు. అనేక మంది, పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం వెలువడిందన్నారు. తెలంగాణ బిల్లు నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల సమస్యలను పట్టించుకోలేదని చెప్పడం సరికాదన్నారు. బిల్లులో సీమాంధ్ర ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. బిల్లును తమ పార్టీకి చెందిన వారే వ్యతిరేకించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రధానమంత్రి ప్రకటించారన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై త్వరలో ప్రణాళిక సంఘం కమిటీని నియమిస్తుందని చెప్పారు. ప్యాకేజీలో విద్య, నీటి తదితర అంశాలు ఉన్నాయన్నారు. విభజన తర్వాత ఐఐఎం, ఎయిమ్స్, మెడికల్ కళాశాలలు... ఇలా ఎన్నింటినో సీమాంధ్రలో నెలకొల్పుతామన్నారు. హంద్రీనీవా, వెలుగోడు, గాలేరు - నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు బిల్లులో చట్టబద్దత కల్పించామన్నారు.
తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామన్నారు. కడపలో స్టీల్ ప్లాంటుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. బెంగళూరు - చెన్నై కారిడార్ మీదుగా చిత్తూరు వెళ్తుందన్నారు. దుగరాజుపట్నం పోర్టుకు కట్టుబడి ఉన్నామన్నారు. సీమాంధ్రలో పదేళ్ల పాటు పన్ను రాయితీలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ వేరు రాష్ట్రమైనా సీమాంధ్రుల భద్రతకు ఢోకా ఉండదన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నుండి తొంభై శాతం గ్రాంట్స్, పది శాతం రుణాలు ఉంటాయన్నారు. సభలో వెంకయ్య నాయుడు గందరగోళపర్చారన్నారు.