7న సంపూర్ణ టి సభ: కోదండరాం, మందకృష్ణ కొత్త పార్టీ
హైదరాబాద్: సంపూర్ణ తెలంగాణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జనవరి 7న మహాధర్నాను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. శనివారం ఆయన సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష వాల్ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుసరిస్తున్న వైఖరి రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు.
తెలంగాణకు అనుకూలమని చెప్పిన పార్టీలకు.. అసెంబ్లీలో చర్చను అడ్డుకునే నైతిక హక్కు లేదని కోదండరాం అన్నారు. సీమాంధ్ర నేతలకు చట్ట సభల పట్ల గౌరవం లేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలు సభను సజావుగా కొనసాగేందుకు సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ బిల్లును చించివేసిన ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఉన్న మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జనవరి 7 తర్వాత అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమైక్యవాదం వినిపిస్తున్న సీమాంధ్ర నేతల్లోనే ఐక్యత లేరని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
కొత్త పార్టీ పెట్ట్టిన మందకృష్ణ
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు శనివారం ప్రకటించారు. ఆ పార్టీకి మహాజన సోషలిస్టు పార్టీ నామకరణం చేసినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. సామాజిక న్యాయమే తమ పార్టీ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఐఆర్ మా కృషే: అశోక్ బాబు
ప్రభుత్వం ప్రకటించిన 27శాతం ఐఆర్ తమ కృషేనని ఏపిఎన్జివో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆదివారం ఏపిఎన్జివో ఎన్నికలు ఉన్నందున ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఐఆర్ కోసం ఉద్యోగులందరినీ కలుపుకుని పోయి సాధించామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో లాబీయింగ్ కూడా అవసరమేనని చెప్పారు. ఏపిఎన్జీవో సంఘం ఐడి ఉన్న వారికే ఓటింగ్కు అనుమతి ఉంటుందని ఆయన చెప్పారు.
ఉద్యోగం నుంచి రిటైరైన వారికి ఓటింగ్ ఇవ్వకూడదని ఎన్నికల అధికారికి విన్నవించామని ఆయన తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అశోక్ బాబు తెలిపారు. ఎన్నికలను ఆపాలను కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్నికలు ఆపాలని కోర్టులో వేసిన పిటిషన్లు కొట్టివేయపడ్డాయని చెప్పారు.












Click it and Unblock the Notifications