దేశానికి, ముఖ్యంగా దక్షిణాదికి: కరుణానిధి మృతిపై పవన్ కళ్యాణ్
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణ వేసిన బాటలు చిరస్మరణీయం అన్నారు. ద్రవిడ ఉద్యమ తపో పుత్రుడైన కరుణ తుది శ్వాస విడువడం విషాదం నింపిందన్నారు. ద్రవిడ సంస్కృతి పరిరక్షణకు అహ్నిషలు శ్రమించిన కరుణ అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆశించామనని, వారి అస్తమయం కేవలం తమిళనాడుకే కాదని, యావత్ దేశానికి, ముఖ్యంగా దక్షిణ భారత దేశానికి తీరని లోటు అన్నారు.
కరుణ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు రాజకీయాలే కాదు భారత రాజకీయ ముఖచిత్రంపై కరుణ బలమైన ముద్రవేశారన్నారు. ద్రవిడ రాజకీయాల్లో మేరునగదీరుడు అన్నారు. అణగారిన వర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు. సాంఘిక దురాచారాలను తెగిడిన పాలకుడిగా, సాంఘిక సంక్షేమానికి కట్టుబడిన విధం ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు.
శ్రీ కరుణానిధి గారు వేసిన బాటలు చిరస్మరణీయాలు - @PawanKalyan#RIPKalaignar pic.twitter.com/zdArtVvuc1
— JanaSena Party (@JanaSenaParty) August 7, 2018
రచనా వ్యాసాంగం నుంచి రాజకీయ యవనికపైకి వచ్చినా కలైజ్ఞర్గానే తమిళుల హృదయాల్లో నిలిచారన్నారు. దీంతో ఆయన ప్రభావం సాహిత్యం ఎంత ఉందో తెలుస్తోందన్నారు. పరాశక్తి, మనోహర వంటి చిత్రాలకు కరుణ అందించిన సంభాషణల గురించి నేటికీ చిత్ర పరిశ్రమ చెప్పుకోవడం తనకు తెలుసునని, రచయితగా, సంస్కృతి పరిరక్షకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ పార్టీ అధినేతగా, రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రిగా వేసిన ఉన్నతమైన బాటలు నేటి తరాలకు, భావితరాలకు చిరస్మరణీయాలు అన్నారు.