'సమస్యల'తో పెంచి పోషించి: పవన్ వ్యూహంలో టీడీపీ విలవిల, ఆ ఆయుధం పేలలేదా?
అమరావతి/శ్రీకాకుళం: నాలుగేళ్ల పాటు మిత్రుడిగా కనిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఇబ్బందులకు గురి చేస్తున్నారా? జనసేనాని దెబ్బకు టిడిపి విలవిలలాడుతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని చెబుతున్నారు.
నాలుగేళ్ల పాటు తాను చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అభివృద్ధి చేయలేకపోవడం అనే అంశాలపై మౌనంగా ఉండటానికి కారణం వేచి చూడడమేనని పవన్ చెప్పారు. వేచి చూసే ధోరణి అవలంభించినట్లు తెలిపారు. అంతేకాదు, లోకేష్పై చేసిన అవినీతి ఆరోపణలు కూడా వ్యూహాత్మకంగానే చేశారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియదని భావిస్తున్నానని, ఇప్పటికీ చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతుందని భావించవలసి ఉంటుందని జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుపై పరోక్షంగా ప్రారంభించి
తద్వారా పవన్ కళ్యాణ్ మొదట నేరుగా చంద్రబాబును టార్గెట్ చేయలేదు. కానీ అవినీతి ఉందని, చంద్రబాబు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచి చంద్రబాబుపై నేరుగా దాడి చేసే వరకు వచ్చింది. అలాగే, ప్రత్యేక హోదాపై ఎన్నో రకాల మాటలు మార్చారని నేరుగానే విరుచుకుపడ్డారు. హోదాపై ముఖ్యమంత్రి ఎన్నో మాటలు మార్చింది ప్రజలంతా చూశారని అంటున్నారు.
'సమస్యల'పై టీడీపీ వద్ద సమాధానం లేదా?
కానీ, పవన్ కళ్యాణ్ పైన టీడీపీ నేతల ఎదురుదాడికి మాత్రం వారి వద్ద సమాధానం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, గత నాలుగేళ్లుగా ఆయన హెచ్చరికగానో లేక మృదువుగానో లేవనెత్తిన సమస్యలపై టీడీపీ సానుకూలంగా స్పందించింది. జగన్తో పోల్చుతూ జనసేనానిపై ప్రశంసలు కురిపించింది. జగన్ ప్రతి సమస్యను రాజకీయం చేస్తున్నారని, పవన్ మాత్రం అలా కాదని, అందుకే ఆయన లేవనెత్తుతున్న సమస్యలపై స్పందిస్తున్నామని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో అన్నారు.
టీడీపీ ఎదురుదాడి
కానీ, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వం అవినీతి అంటూ నిప్పులు చెరిగారో అప్పటి నుంచి ఎదురుదాడి చేస్తున్నారు. పవన్ను టార్గెట్ చేసుకోవడానికి వారికి సరైన ఆయుధాలు లేకుండా పోయాయని అంటున్నారు. ఆయన ఇప్పుడే రాజకీయాలు ప్రారంభించడం అందుకు ఒక కారణం అయితే.. ఆయన లేవనెత్తిన అంశాలపై గతంలో సానుకూలంగా స్పందించి, ఇప్పుడు విమర్శలు చేస్తే ఇరకాటంలో పడినట్లేనని అంటున్నారు.
పవన్ కళ్యాణ్పై పేలని 'కుట్ర' ఆయుధం!
అందుకు, టీడీపీ ఎన్నుకున్న బీజేపీ కుట్రలో పవన్ కళ్యాణ్, జగన్ పావులు అనే వ్యాఖ్యలు కూడా ఉపయోగకరంగా లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే పవన్ పదేపదే లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు సాగుతున్నారు. బీజేపీకి బద్ధ శత్రువులైన లెఫ్ట్ పార్టీలతో ఆయన ముందుకు సాగుతుంటే బీజేపీ ఆడిస్తున్నట్లు పవన్ ఆడుతున్నారనే మాటలకు అర్థం లేదని అంటున్నారు.
మొదట్లోనే కట్టడి చేస్తే
పవన్ కళ్యాణ్ అమరావతిలో భూముల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడం, టీడీపీ ఎంపీలపై ఆర్థికపరమైన విమర్శలు చేసినప్పటి నుంచి ఆయనను కూడా జగన్లా ప్రత్యర్థిలా భావిస్తే బాగుండేదని, ఇన్నాళ్లు ఆయనపై లేవనెత్తిన ప్రతి అంశంపై సానుకూలంగా స్పందించడం, నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేసినా అధిష్టానం ఆదేశాల మేరకు తగ్గడం.. నష్టం చేకూర్చిందని కొందరు భావిస్తున్నారట. పవన్ను మొదటి నుంచి కట్టడి చేస్తే బాగుంటేదని కొందరు తెలుగు తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారట. టీడీపీ నేతలపై గతంలో విమర్శలు చేసినప్పుడు చంద్రబాబు... పవన్ను ఏమనవద్దని క్లాస్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు నేరుగా లోకేష్, ప్రభుత్వాన్ని విమర్శించడంతో ఎదురు తిరుగుతున్నారని అంటున్నారు.
నాలుగేళ్ల పాటు పవన్ భ్రమలో
ఓ విధంగా పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల పాటు చంద్రబాబుకు అనుకూలంగా కనిపించారని, దీంతో టీడీపీ ఆయన పట్ల మౌనంగా ఉందని, కానీ జనసేనాని వ్యూహాత్మకంగా ఏడాదికి ముందు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారని, నాలుగేళ్ల పాటు కాపు ఓట్ల కోసం, యువత ఓట్ల కోసం పవన్ భ్రమలో ఉన్న టీడీపీ, ఇన్నాళ్లు ఆయన బుట్టలో పడిపోయి, ఇప్పుడు తీవ్ర విమర్శల తర్వాత మేలుకున్నారని అంటున్నారు. అయితే, పవన్ను వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఏవిధంగా గట్టిగా ఎదుర్కుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.