తన ఓటమికి కారణం చెప్పిన పవన్ కల్యాణ్: టీటీడీని ప్రక్షాళన చేస్తా
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవ్వాళ గుంటూరు జిల్లాకు వచ్చారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన బీసీ నాయకుల సదస్సులో మాట్లాడారు. పలు హామీలు ఇచ్చారు.
గుంటూరు: జనసేన పార్టీ.. ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమౌతోంది. ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో ఆవిర్భావ సభను నిర్వహించనుంది. ఇది- జనసేన 10వ ఆవిర్భావ సభ. దీన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అధినేత పవన్ కల్యాణ్ ఈ సభకు వారాహి వాహనంలో వేదిక వద్దకు చేరుకోనున్నారు. సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. ఆవిర్భావ సభ పోస్టర్ కూడా ఆవిష్కరించారు.

వైసీపీని ఓడించడమే..
2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నందున- జనసేన అనుసరించబోయే వ్యూహాలు, లక్ష్యాల గురించి ఈ సభా వేదికపై నుంచి పవన్ కల్యాణ్ ప్రకటిస్తారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే జనసేన ప్రధాన ఉద్దేశం. వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించుకోవడమేనని తమ ముందున్న కర్తవ్యమంటూ ఇప్పటికే ఆ పార్టీ నాయకులు పలు సందర్భాల్లో ప్రకటించారు. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహాలను పవన్ కల్యాణ్ వివరించనున్నారు.

మంగళగిరిలో..
ఈ ఆవిర్భావ సభకు సన్నాహకంగా ఇవ్వాళ జనసేన పార్టీ- బీసీ నాయకులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించింది. పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో మంగళగిరికి చేరుకున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ సహా పలువురు సీనియర్లు దీనికి హాజరయ్యారు.

బీసీలంటే..
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ అంటూ వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బీసీలకు ఆర్థిక పరిపుష్ఠి, రాజ్యాధికార సాధన కోసం తము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల్లో అనైక్యత నెలకొని ఉందని, అదే మిగిలిన పార్టీలకు బలాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. బీసీల్లో సాధికారత రావాలనే విషయాన్ని తాను చేతల్లో చూపిస్తానని పేర్కొన్నారాయన.

టీటీడీ పాలక మండలిలో..
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 36 మంది సభ్యులు ఉంటే అందులో ముగ్గురు బీసీలకు మాత్రమే చోటు దక్కిందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే- టీటీడీ ట్రస్ట్ బోర్డులో సగం మంది బీసీలకు స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. బీసీలు రెండు కోట్ల మంది ఉంటే అందులో నాలుగున్నర లక్షల మందికి ప్రతి సంవత్సరం 10 వేల రూపాయలను ఇచ్చి.. వాళ్ల భవిష్యత్తును కొనేస్తోన్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

సోషల్ ఇంజినీరింగ్ చేశాను..
తానుఏ ఒక్క కులానికో చెందిన నాయకుడిని కాదని పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో కాపులు, శెట్టిబలిజల మధ్య సయోధ్యను కుదిర్చి.. సోషల్ ఇంజినీరింగ్ కు నాంది పలికానని చెప్పారు. కాపులు తనను ఓన్ చేసుకోలేదని, అలా జరిగి ఉంటే తాను ఓడిపోయేవాడిని కాదని చెప్పారు. గోదావరి జిల్లాల్లో తమ పార్టీకి వచ్చిన ఓట్లల్లో సగానికి పైగా బీసీలు వేసినవేనని, మత్స్యకారులు తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications