Jana Sena formation day: పవన్ కల్యాణ్ వీడియో: ప్రశ్నించే గొంతుక స్థితి నుంచి ప్రశ్నార్థకంగా?
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో తొలి అడుగులోనే అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన పార్టీ.. జనసేన. పవర్ స్టార్గా చిత్ర పరిశ్రమను ఏలుతున్న దశలో.. పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడమనేది ఎవరూ ఊహించనిదే. ఎన్టీ రామారావు గానీ, ఆ తరువాత చిరంజీవి గానీ దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగిన తరువాతే రాజకీయ అరంగేట్రం చేశారు. వారికి భిన్నంగా పవన్ కల్యాణ్.. తన కేరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ప్రకంపనలను సృష్టించింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.
పొటీ చేయకుండా తొలి అయిదేళ్లు..
ఏడేళ్ల కిందట మార్చి 14వ తేదీన ఆవిర్భవించిందీ పార్టీ. ఆదివారం నాటితో ఏడేళ్లను పూర్తి చేసుకుంటోంది. ఏ రాజకీయ పార్టీకి అయినా.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం. దాని కోసం అధికారంలోకి రావాలని కోరుకుంటాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటాయి. అధికారంలోకి రావాలంటే ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందే. పవన్ కల్యాణ్.. దీనికి భిన్నమైన బాటను ఎంచుకున్నారు. తొలి అయిదేళ్లు ఎలాంటి ఎన్నికల్లోనూ ఆయన గానీ, ఆయన పార్టీ గానీ పోటీ చేయలేదు. తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ఇచ్చారు.
ప్రశ్నించే గొంతుకగా..
తాను మద్దతు ఇచ్చిన టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత.. పాలకులు చేసే తప్పులను నిలదీస్తానని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకనవుతానంటూ ప్రకటించారు. రాష్ట్రంలో తెలుగుదేశం.. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను జనక్షేత్రంలో ఎండగడతానంటూ భరోసా ఇచ్చారు. అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదంటూ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్ధానం కిడ్నీ సమస్య, రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం భూసమీకరణ వ్యవహారంలో మూడు గ్రామాల తరఫున మాత్రమే ప్రశ్నించడం.. వంటి పరిణాలు తొలి అయిదేళ్లలో చోటు చేసుకున్నాయి.
పాచిపోయిన లడ్డూలంటూ..
ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. తిరుపతి బహిరంగ సభలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాచిపోయిన లడ్డూలంటూ అప్పటి కేంద్రమంత్రి, ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలను సంధించారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా ఆరోపణలను గుప్పించిన సందర్భాలు లేకపోలేదు. ప్రతిపక్షంలో ఉంటూ అనేక అద్భుతాలను చేయొచ్చంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అధికార తెలుగుదేశం పార్టీని ప్రశ్నించకుండా ప్రతిపక్షాలను నిలదీస్తున్నారనే ఆరోపణలను పవన్ కల్యాణ్ ఎదుర్కొన్నారు.
2019లో పోటీకి దిగినా..
పార్టీని స్థాపించిన అయిదేళ్ల తరువాత పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో పోటీ చేశారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీనికోసం ఆయన సీపీఐ, సీపీఎం, బహుజన్ సమాజ్వాది పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అప్పట్లో అది వివాదాన్ని రేపింది. బీజేపీకి పరోక్షంగా మద్దతు పలికిన పవన్ కల్యాణ్.. ఒక్కసారిగా బీజేపీ సిద్ధాంతాలకు పూర్తిభిన్నమైన వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని, ఎన్నికల్లో పోటీ చేశారు. తాను స్వయంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో దిగినప్పటికీ.. చేదు ఫలితాలను ఎదుర్కొన్నారు. భీమవరం, గాజువాకల్లో వైసీపీ అభ్యర్థుల చేతుల్లో ఓటమిపాలయ్యారు.
మళ్లీ బీజేపీ వైపు టర్న్..
కేంద్రంలో బీజేపీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్దిరోజుల్లోనే మళ్లీ బీజేపీ వైపు టర్న్ అయ్యారు. అదీ వివాదాస్పదంగానే మారింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఫలితంగా అటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఇటు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో పోటీకి దూరం కావాల్సి వచ్చింది. పొత్తులో భాగంగా ఈ రెండు చోట్ల బీజేపీకి మద్దతు ఇస్తోంది. ఈ ఏడేళ్ల ప్రయాణంలో పవన్ కల్యాణ్ సాధించిందేమిటనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. కాగా- పార్టీ ఏడేళ్ల ప్రయాణంపై ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేయనున్నారు.