"దాసరి" సమాధిని పట్టించుకునే వారే లేరా..?
టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా వందలాది చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఎంతోమంది స్టార్ హీరోలను పరిచయం చేసి, తనదైన బలమైన ముద్ర వేశారు. 2017లో అనారోగ్యంతో కన్నుమూసినా, ఆయన సృష్టించిన కళాఖండాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన సమాధికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ యాంకర్ సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. దాసరి సమాధి నిర్లక్ష్యానికి గురై పాడుబడిన స్థితిలో కనిపించడంతో సినీ పరిశ్రమలో అలజడి మొదలైంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో దాసరి సమాధి దుస్థితిపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్రంగా స్పందించేలా చేసింది.

ఈ ఘటనపై నటుడు మంచు మనోజ్ తీవ్రంగా స్పందిస్తూ.. దాసరి నారాయణరావు సమాధి వద్దకు స్వయంగా వెళ్లారు. అక్కడ పాడుబడిన స్థితిలో ఉన్న సమాధిని చూసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "తెలుగు సినిమాకు ఎనలేని సేవ చేసిన దాసరి గారి సమాధిని ఇలా నిర్లక్ష్యంగా చూడటం బాధాకరం. ఆయన స్మృతిని గౌరవించి, సమాధిని పరిశుభ్రంగా ఉంచాలి" అని మనోజ్ ఉద్వేగంగా పేర్కొన్నారు.
ఈ వీడియో చూసిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా మంచు మనోజ్ తో కలిసి క్లీనింగ్ పనులు ప్రారంభించారు. దాసరిగారితో పాటు ఆయన భార్య సమాధి కూడా అదే దుస్థితిలో కన్పించడంతో, ఈ విషయం అభిమానులను మరింత కలత పరిచింది. ఈ అంశమై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల విజయాలను, ఆస్తులను అందించిన దాసరి సమాధులను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం దారుణమంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో కీలక స్థానం ఉన్న ఒక మహానీయుడి సమాధి పట్ల ఈ నిర్లక్ష్యం క్షమించరానిదని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, మే 30న దాసరి నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన సమాధి దుస్థితి వెలుగులోకి వచ్చి, పెద్ద చర్చకు దారితీసింది. ఆ మహానీయుడి జ్ఞాపకాలను కాపాడాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది. సమాధి పరిస్థితిని వెలుగులోకి తీసుకువచ్చిన యాంకర్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications