రూ.800 లంచం కేసులో 20 ఏళ్ల తర్వాత తీర్పు..
అది 2006 ఆగస్టు నెల.. నవీ ముంబయిలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) కార్యాలయం ఎప్పటిలాగే ఉద్యోగులు, ప్రజలతో సందడిగా ఉంది. అక్కడ అరవింద్ మోతీరామ్ సావంత్ అనే వ్యక్తి క్లర్కుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక అనుమతి లేని నిర్మాణానికి సంబంధించిన పత్రాలను అందించేందుకు, ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధి నుంచి కేవలం రూ.800 లంచం డిమాండ్ చేశాడనేది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ.
రంగంలోకి దిగిన సీబీఐ (CBI) అధికారులు పక్కా స్కెచ్తో వల పన్నారు. అనుకున్నట్లే ఆగస్టు 22వ తేదీన సదరు ప్రైవేటు వ్యక్తి నుంచి రూ.800 నగదు తీసుకుంటుండగా రంగులరాట్నంలో దొరికినట్లుగా సావంత్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీబీఐ అధికారులు ఆ నోట్లను జప్తు చేసి, కేసు నమోదు చేయడంతో అరవింద్ మోతీరామ్ సావంత్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది.

మలుపు తిప్పిన క్రాస్ ఎగ్జామినేషన్: అసలు పవరే లేదు!
ఈ చిన్న మొత్తం లంచం కేసు దాదాపు రెండు దశాబ్దాల పాటు కోర్టు గడపల చుట్టూ తిరిగింది. నిందితుడిపై మోపిన నేరాన్ని నిరూపించేందుకు సీబీఐ గట్టిగానే ప్రయత్నించింది. అయితే, సుదీర్ఘ విచారణలో భాగంగా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ (Cross Examination) ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పింది. ఫిర్యాదుదారు కోరిన సర్టిఫైడ్ ప్రభుత్వ పత్రాలను జారీ చేసే అంతిమ అధికారం అసలు ఆ క్లర్కుకు లేదనే పచ్చి నిజం న్యాయస్థానం ముందుకొచ్చింది.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అత్యంత భద్రంగా దాచే ఆ పత్రాలు అసలు సదరు క్లర్కుకు అందుబాటులోనే ఉండవని నిందితుడి తరఫు న్యాయవాది పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించారు. ఆ పత్రాలు ఇచ్చే అధికారమే లేనప్పుడు.. ఆయన లంచం ఎలా డిమాండ్ చేస్తాడనే పాయింట్ తెరపైకి వచ్చింది.
ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ కోర్టు: నోట్లు దొరికితే సరిపోదు!
ఈ నాటకీయ పరిణామాల మధ్య దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో సంచలన తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి అయిన అరవింద్ మోతీరామ్ సావంత్ను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయమూర్తి తుది తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. "నిందితుడి వద్ద లంచం డబ్బులుగా భావిస్తున్న నోట్లను కేవలం స్వాధీనం (జప్తు) చేసుకున్నంత మాత్రాన సరిపోదు.
సదరు ఉద్యోగి లంచాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేశాడనే విషయాన్ని నిరూపించే బలమైన, తిరుగులేని సాక్ష్యాలను ప్రవేశపెట్టాలి. అలా డిమాండ్ చేసినట్లు నిరూపించలేనప్పుడు నిందితుడిని దోషిగా తేల్చలేం" అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో రూ.800 లంచం ఆరోపణలతో 20 ఏళ్లుగా సమాజంలో నిందలు మోసిన ఒక మాజీ ఉద్యోగికి ఎట్టకేలకు క్లీన్ చిట్ లభించింది.














Click it and Unblock the Notifications