జనసేనకు ఎమ్మెల్యే రాపాక మరో ఝలక్: లాంగ్మార్చ్కు దూరం?
అమరావతి: అసెంబ్లీలో జనసేన పార్టీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఏకైక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్.. మరోసారి పార్టీ అగ్ర నాయకత్వానికి ఝలక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. అసెంబ్లీకి ఎన్నికైనప్పటి నుంచీ ఆయన స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్ణయాలు, సిద్దాంతాలకు ఏనాడూ కట్టుబడినట్లు కనిపించలేదు. తాను చెప్పదలచుకున్నది నిరభ్యంతరంగా చెప్పేస్తున్నారు. తాను చేయదలచుకున్నది కూడా అంతే స్వేచ్ఛగా చేసేస్తున్నారు. తాజాగా ఆయన అలాంటి మరో నిర్ణయమే తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

లాంగ్మార్చ్కు దూరంగా ఉండాలని..
భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్న తరువాత జనసేన పార్టీ తొలిసారిగా ఓ భారీ ప్రదర్శనను నిర్వహించబోతోన్న విషయం తెలిసిందే. లాంగ్మార్చ్ పేరుతో వచ్చేనెల 2వ తేదీన ఈ ప్రదర్శనను బీజేపీ, జనసేన సంయుక్తంగా సారథ్యాన్ని వహించబోతున్నాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి నుంచి విజయవాడ వరకూ కొనసాగుతుందీ లాంగ్మార్చ్. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉండటానికి, రాజధానిగా అమరావతినే కొనసాగించడానికీ ఉద్దేశించిన మహా ప్రదర్శన ఇది.

దూరంగా ఉండాలనుకుంటున్న రాపాక
బీజేపీతో పొత్తు తరువాత చేపట్టిన మహా ప్రదర్శన కావడం వల్ల జనసేన పార్టీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పైగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తరువాత దీన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవడం వల్ల.. తన సత్తా ఏమిటో చాటాలని భావిస్తోంది. ఇంత ప్రాధాన్యత ఉన్న లాంగ్మార్చ్కు దూరంగా ఉండాలని రాపాక వరప్రసాద్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ అగ్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు ముందు నుంచీ తాను ఎలా దూరాన్ని పాటిస్తూ వస్తున్నారో.. అదే వైఖరిని ఇక్కడా ప్రదర్శించాలని రాపాక భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీతో కలవడం వల్లే..
బీజేపీతో పార్టీ పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీతో కలిసి లాంగ్మార్చ్ను నిర్వహించాల్సి రావడం వల్లే రాపాక ఈ సారి గైర్హాజరు కావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతకుముందు విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్మార్చ్కు రాపాక హాజరయ్యారు. అప్పట్లో పార్టీ సొంతంగా ఈ భారీ ప్రదర్శనను నిర్వహించింది. విశాఖ లాంగ్మార్చ్కు, ఈ సారి నిర్వహించబోయే లాంగ్మార్చ్కు మధ్య చాలా తేడాలు ఉన్నాయని రాపాక భావిస్తున్నారు.

కాషాయమయమైన జనసేన..
ఈ సారి జనసేన పార్టీలో రాజకీయ పరిస్థితులు, వాతావరణం భిన్నంగా కనిపిస్తున్నాయని, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాషాయమయమైందని, అది ఇష్టం లేకపోవడం వల్లే ఈ సారి నిర్వహించబోయే లాంగ్మార్చ్కు దూరంగా ఉండాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ లాబీల్లో కొందరు విలేకరుల వద్ద ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. లాంగ్మార్చ్లో పాల్గొనకూడదని తాను భావిస్తున్నానని, అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో కదా? అని రాపాక వ్యాఖ్యానించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications