జనసేన పార్టీ వ్యూహకర్త: పీకేలా బీజేపీకి పని చేశారా, ఎవరీ దేవ్?
అమరావతి/హైదరాబాద్: జనసేన పార్టీ వ్యూహకర్తగా దేవ్ను నియమించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీకి పని చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న పవన్ కూడా దేవ్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. అయితే ఈ దేవ్ ఎవరు అనేది అందరికీ ప్రశ్నగా మారింది. రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ నేతల భేటీలో దేవ్ మాట్లాడుతూ... తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేశానని, తనకు ఆ అనుభవం ఉందని చెప్పారు.

నిన్న బీజేపీకి, నేడు జనసేన కోసం తెరపైకి
ప్రస్తుతం జనసేనకు వ్యూహకర్తగా ఉన్న దేవ్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? అనే చర్చ అందరిలోను, ముఖ్యంగా జనసేన
అభిమానుల్లో ఉంది. అయితే, ఈ దేవ్ గతంలో బీజేపీకి పని చేశారని అంటున్నారు. ఇప్పుడు జనసేన కోసం తెరపైకి వచ్చారు. ఈయన హైదరాబాదులోని ఖైరతాబాద్ సమీపంలోని చింతల్బస్తీ వాసీగా చెబుతున్నారు.

అలా కేంద్రమంత్రులతో పరిచయాలు పెంచుకున్నారని
దేవ్ గతంలో గతంలో బీజేపీకి పని చేయడమే కాకుండా పార్టీలో చేరారని, తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయలు స్వయంగా ఆయనకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. ఆ తర్వాత బీజేపీ కేంద్ర నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయట.

మోడీకి ప్రశంస
2014కు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీని కీర్తిస్తూ ప్రసంగాలు చేశారని చెబుతున్నారు. బీజేపీకి ఆయన పదేళ్ల పాటు పని చేశారు. ఇప్పుడు అదే దేవ్ జనసేన పార్టీ కోసం పని చేస్తున్నారని, ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలో నెలకొని ఉందని చెబుతున్నారు.

ఆకట్టుకున్న దేవ్
కాగా, దేవ్ డ్రెస్సింగ్ స్టయిల్, బాడీ లాంగ్వేజ్ అందరినీ ఆకట్టుకున్నాయి. పవన్ పరిచయం చేసినప్పుడు ఇంగ్లీషులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. ఆయన తెలుగులోను అనర్ఘలంగా మాట్లాడగలరని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications