రేపే.. జనసేన కీలక భేటీ: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపు.. !!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన పట్టును ఇక్కడా నిలుపుకోవడానికి వ్యూహాలను రూపొందిస్తోంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఈ విషయంలో ఇప్పటికే ఆయా పార్టీలన్నీ కూడా సమావేశాలు నిర్వహిస్తూ వస్తోన్నాయి. మొన్నటికి మొన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్.. అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలతో సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దనీ సూచించారు. ప్రతి చోటా ఎన్నికలు జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచుకోవాలని ఆదేశించారు.

ఈ క్రమంలో జనసేన పార్టీ.. ఆత్మీయ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 28వ తేదీన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలో ఈ భేటీ జరుగనుంది. ఇందులో మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన జనసేన అభ్యర్థులు కూడా పాల్గొననున్నారు. అలాగే.. 2021 స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసినవారూ దీనికి హాజరుకానున్నారు.
పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడంపై ఇందులో చర్చిస్తారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దీని తర్వాత.. స్థానిక ఎన్నికల విధివిధానాల కోసం 14 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ కూడా సమావేశమౌతుంది.
కాగా.. ఏపీ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నాగబాబు అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ అందుబాటులో లేని కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించాలని నాగబాబు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది శ్రేయోభిలాషులు మాత్రమే హాజరవుతున్నారు. ఎవరూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దని నాగబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications