నన్ను చూసిన హుషారులో బైక్ రెయిజ్ చేస్తారని చెప్పా, వద్దు.. భయమేస్తోంది: పవన్
భీమవరం: గురుపౌర్ణిమ రోజున ఒక్కటే చెబుతున్నానని, ఈ రాష్ట్రాన్ని కచ్చితంగా కైవసం చేసుకుంటామని (అధికారంలోకి వస్తామని) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సత్యసాయి బాబా, షిర్డీ సాయిబాబా, ఏసు దేవుడు, అల్లా, పరమేశ్వరుడు, మావూళ్లమ్మ ఆశీస్సులతో అధికారంలోకి వస్తామన్నారు.
ప్రచారానికి నేను, ఫోన్ చేస్తే లైన్లోకి రాలేదు: బీజేపీ ఎంపీపై పవన్, బాబూ ఇక్కడకొచ్చి కూర్చో
అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్
అభిమానులు ఉత్సాహంతో ముందుకు రావడం, కరెంట్ వైర్ల వద్దకు రావడం చూసిన పవన్.. పలుమార్లు వారికి దూరం జరగాలని విజ్ఞప్తి చేశారు. అందరి కోసం నేను 360 డిగ్రీలు తిరిగి మాట్లాడాల్సి వస్తోందని మధ్యలో అన్నారు. చాలామందికి ఫోటోలు ఇవ్వాలని తనకు ఉందని, అది మర్చిపోవద్దన్నారు. నేను ఒక్కడినేనని, దయచేసి నన్ను అర్థం చేసుకోండన్నారు. కుదిరినప్పుడల్లా మీకు నా ఫోటోలు (సెల్ఫీ) ఇస్తానని చెప్పారు. మనం ఫోటోలు దిగితే సమస్యలు పరిష్కారం కావని, కాబట్టి సమస్యలను పట్టించుకునే అవకాశం తనకు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా యువత బైక్ పైన స్పీడ్గా వెళ్లవద్దని, మీరు అలా వెళ్తుంటే నాకు భయం వేస్తోందని పవన్ అన్నారు. బైక్తో మీవాళ్లు సౌండ్ చేస్తారని చాలామంది అన్నారని, దానికి తాను మా వాళ్లు మహా అయితే బైక్ సౌండ్ రెయిజ్ చేస్తారని, కానీ వైసీపీ, టీడీపీలో దోచుకోవడం, మహిళా అధికారులను కొట్టరని, ఇసుక, మట్టి మాఫియాలు చేయరని, లోకేష్లా అవినీతికి అండగా ఉండరని చెప్పానని అన్నారు. పవన్ను చూస్తే హుషారు వచ్చి జనసైనికులు అలా చేస్తారన్నారు. దోపిడీపై పవన్ పోరాడుతున్నారని అలా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారన్నారు. మావాళ్లు మహా చేస్తే బైక్ రెయిజ్ తప్ప అంతకుమించి చేయరని, దానిని మేం సరి చేసుకుంటామని, మరి అవినీతి ఆపుతారా అని ప్రశ్నించారు. కానీ మీరు (అభిమానులు) బైక్ రెయిజ్ చేయడం ఆపి, వారి (టీడీపీ, వైసీపీ) దోపిడీల వైపు చూడాలన్నారు. వారిని ఆపాలన్నారు. మావాళ్లు (యువత)కు ఆశీస్సులు, గైడెన్స్ ఇవ్వాలని పెద్దలను కోరారు. యువతకు నేను చెప్పేది ఒక్కటేనని, త్యాగం జనసేన చేస్తుందని, మీరు బాగుండాలన్నారు.
Recommended Video
మీ ఫ్యామిలీతో చర్చించి నిర్ణయం తీసుకోండి
మొగల్తూరులో తమకు ఉన్న పొలం ఉండి ఉంటే తాను పశ్చిమ గోదావరి జిల్లా దాటి వెళ్లకపోయేవాడినేమో అన్నారు. నేను ఇక్కడ పెరగలేదు కాబట్టి గోదావరి జిల్లా రుణం తీర్చుకుంటానని చెప్పారు. సర్ ఆర్థర్ కాటన్ రోజులు తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఒక్క స్పీచ్తో మిమ్మల్ని ఆకట్టుకోవాలని, ఓట్లు అడగాలని రాలేదన్నారు. మీరు ఇంటికి వెళ్లి పవన్ గురించి, జనసేన సిద్ధాంతాల గురించి ఆలోచించాలన్నారు. మీ సమస్యలపై ఎవరు నిలబడతారో చూడాలన్నారు. మీరు ఓటు వేసినా, వేయకున్నా మీకు అండగా ఉంటానని చెప్పారు. చంద్రబాబు కావాలా, సీఎం అయితే సమస్యలు పరిష్కరిస్తాననే జగన్ కావాలా, అండగా ఉండే నేను కావాలా మీరు మీ కుటుంబంలో చర్చించి నిర్ణయించుకోవాలన్నారు.
పోలీసులు, అధికారులపై ఆగ్రహం వద్దు, సీఎం పేషీ నుంచి ఆదేశాలు
పోలీసు శాఖపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని, కానీ పోలీసులు, ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు నిస్సహాయులని, వారికి సీఎం పేషీ నుంచి ఆదేశాలు వస్తున్నాయని, వారిపై ఆగ్రహం వద్దని పవన్ అన్నారు. నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకునని, కాబట్టి అధికారులు, పైవారు చేసే వాటికి మేమేం చేస్తామని తన తండ్రి అనేవారన్నారు. కాబట్టి పోలీసులు, అధికారులు మా వల్ల ఇబ్బంది పడితే క్షమించాలన్నారు. నేను ఈ మీటింగ్ తర్వాత వెళ్లిపోవడం లేదని, ముప్పై రోజులు పశ్చిమ గోదావరి జిల్లాలో, మరో ముప్పై రోజులు తూర్పు గోదావరి జిల్లాలో ఉంటానని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టాలని సీఎం పేషీ నుంచి ఆదేశాలు వస్తున్నాయన్నారు.
నాకు అవకాశమివ్వండి
నలభై ఏళ్ల పాటు కాంగ్రెస్కు, ఇరవై ఏళ్ల పాటు టీడీపీకి పాలించే అవకాశమిచ్చారని, ఈసారి జనసేనకు ఇవ్వాలని అంతకుముందు, పలువురు పార్టీ నేతల చేరిక, కార్యకర్తల సమావేశంలో పవన్ అన్నారు. జనసేనకు యువతనే ఇంధనం అన్నారు. పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జనసైనికులు ఉంటారని, జనసేన జెండా ఎగురుతుందని చెప్పారు. సమాజంలో సరికొత్త మార్పు తీసుకు వస్తామని నమ్మి పార్టీలో చేరిన వారికి హృదయపూర్వక స్వాగతం అన్నారు. జనసేనకు యువత ఇంధనం అని, వారికి స్థానిక అనుభవం కలిగిన నేతలు తోడైతే బలంగా పాతుకుపోతుందన్నారు. తాను రాజకీయాన్ని చాలా బాధ్యతతో చేస్తానని చెప్పారు.
ఓటు అంటే నాటుకోడి పెట్టలా తయారైంది
దోపిడీ, లంచగొండితనం లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని పవన్ చెప్పారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకు వస్తానన్నారు. ఓటు విలువ నాటు కోడిపెట్ట విలువలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మంచి చెప్పాలంటే సినిమాల్లో రెండున్నర గంటల సమయం చాలని, నిజ జీవితంలో ఇరవై ఏళ్లు పడుతుందన్నారు. మరో ఇరవై అయిదేళ్లు రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు. మార్పు అనేది ఒక పూటలో రాదని, ఆశయం, సహనం ఉండాలని పవన్ అన్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఇలా ఏ రాష్ట్రాల్లో ఎక్కడకు వెళ్లినా ఇదే అభిమానం చూపిస్తున్నారని చెప్పారు. యువశక్తిపై విశ్వాసం ఉందన్నారు. తమ పార్టీ ప్రశ్నిచడమే కాదని, పాలించే పార్టీ కూడా అని చెప్పారు. తనను సీఎంను చేస్తేనే సమస్యలు పరిష్కరిస్తానని తాను చెప్పనని, మీరు ఓట్లు వేసినా, నేయకపోయినా సమస్యలపై పోరాడుతానని స్పష్టం చేశారు.
నా సుఖం కోసం సినిమాల్లో నటించి, 60 ఏళ్ల తర్వాత రావొచ్చు కానీ
మీ అందరి బాగు కోసం మీ ఇంటి నుంచి ఒకడు వచ్చి పార్టీ పెట్టాడని పవన్ కళ్యాణ్ అన్నారు. అది జనసేన అన్నారు. వ్యక్తిగత సమస్యలను తాను తీర్చలేను కానీ పబ్లిక్ పాలసీ రూపంలో అందరికీ భద్రత కలిగిన సమాజాన్ని నిర్మిస్తానని చెప్పారు. నా సుఖం నేను చూసుకొని కోట్లు సంపాదించి అరవై ఏళ్ల తర్వాత రాజకీయాలలోకి రావొచ్చునని, అప్పుడు కూడా తనను ఎవరూ అడగరని, కానీ దాని వల్ల ప్రయోజనం ఉండదన్నారు. శక్తి ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రజా జీవితంలోకి వచ్చానని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఎప్పుడూ చిన్నపిల్లలే ఉంటారని కొందరు అంటున్నారని, అది కరెక్టేనని, అసలు తాను రాజకీయాల్లోకి వచ్చిందే భావితరాల కోసమని చెప్పారు. తాను వచ్చింది దోపిడీ చేసేవారి కోసం కాదన్నారు.