వైసీపీ ఎమ్మెల్యేకు ఎంపీ సీటుపై పవన్ కల్యాణ్ హామీ..!?
ఏపీలో ఎన్నికల జంపింగ్స్ మొదలయ్యాయి. సీఎం జగన్ పార్టీ ఇంఛార్జ్ ల్లో మార్పులు చేర్పులు మొదలు పెట్టారు. గెలుపే ప్రధానంగా సీట్లను ఖరారు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో మార్పుల పైన ఇప్పటికే కసరత్తు పూర్తి చేసారు. సీట్లు ఇవ్వలేని వారికి భవిష్యత్ అవకాశాల పైన హామీ ఇస్తున్నారు. సీట్లు రాని కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సీటు రాదని తేలిన ఒక ఎమ్మెల్యేకు జనసేనాని ఎంపీగా హామీ ఇచ్చినట్లు సమాచారం.
జనసేనలోకి ఎంట్రీ
వైసీపీ సీట్ల ఖరారు వేళ సీట్లు రాని కొందరు పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. గోదావరి జిల్లాల్లో సీట్ల మార్పు వైసీపీలో ఒక కొలిక్కి వచ్చింది. అధికారికంగా ప్రకటించకపోయినా మార్పు చేసే స్థానాల్లో సిట్టింగ్ లకు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కొత్త అభ్యర్దులు ఎవరనేది తేల్చారు. సీట్లు కొందరివి మార్పులు చేర్పులు చేసారు. ఈ సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో సీట్లు కోల్పోవటం ఖాయమని నిర్ణయించిన నియోజకవర్గాల్లో జగ్గంపేట పేరు ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానంలో మాజీ ఎంపీ తోట నర్సింహం ను బరిలోకి దించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో, చంటిబాబు తాజాగా జనసేనాని పవన్ తో సమావేశమయ్యారు.

ఎంపీగా పోటీకి ఛాన్స్
ఆ సమయంలో పవన్ నుంచి చంటిబాబుకు స్పష్టమైన హామీ వచ్చినట్లు చెబుతున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ, స్థానిక టీడీపీ నేతలు వ్యతిరేకించారు. చంటిబాబు వస్తే తాము సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో, పవన్ తో సమావేశమైన సమయంలో చంటిబాబు నియోకజవర్గంలోని స్థానిక పరిస్థితులను వివరించారు. టీడీపీ, జనసేన కలిసి పని చేసే పరిస్థితులు కనిపించటం లేదని వివరించారు. జనసేన నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ కాకినాడ లోక్ సభ కు చంటిబాబు పేరును పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాకినాడ ఎంపీ అభ్యర్దిగా ఇప్పటికే పార్టీ వర్గాల్లో తోట సుధీర్ పేరు ప్రచారంలో ఉంది.
మారుతున్న లెక్కలు
ఇప్పుడు చంటిబాబు నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో సమావేశం అవుతున్నారు. పవన్ కల్యాణ్ చంటిబాబుకు హామీ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందరూ సహకరించాలని చంటిబాబు కోరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. 2009,2014 ఎన్నికల్లో చంటిబాబు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి గెలుపొందారు. జనసేనకు వచ్చే ఎన్నికల్లో కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను టీడీపీ కేటాయించినట్లు సమాచారం.దీంతో..ఇప్పుడు చంటిబాబు సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లుగా పవన్ ఎంపీ సీటు ఇస్తారని చెబుతుండటంతో ఎంత వరకు ఆచరణ సాధ్యం అవుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications