పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ మీడియా సంబరాలు
Recommended Video

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జనసేనాని చేసిన కామెంట్స్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం కడప జిల్లా పర్యటన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ పవన్ చేసిన వ్యాఖ్యలేంటి... రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయి..?

పాక్ మీడియాలో పవన్ వ్యాఖ్యలు
భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికలకు ముందే పాకిస్తాన్తో భారత్ యుద్ధానికి వెళుతుందని ఆ తర్వాతే ఎన్నికలకు వెళుతుందని తనతో కొందరు రెండేళ్ల క్రితమే చెప్పినట్లు జనసేనాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా పాక్ మీడియా డాన్లో కూడా పవన్ వ్యాఖ్యలు ప్రచురితమయ్యాయి. కడప జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో టీడీపీతో ఉన్న సంగతి తెలిసిందే.

విపక్షాలకు విమర్శనాస్త్రంగా పవన్ వ్యాఖ్యలు
ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు విపక్షాలకు విమర్శనాస్త్రాలుగా మారాయి. పాకిస్తాన్పై యుద్ధానికి వెళుతుందని ... రహస్యంగా ఉంచాల్సిన ఈ విషయం పవన్ కళ్యాణ్కు ఎలా తెలిసిందని ధ్వజమెత్తుతున్నాయి. యుద్ధాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని విపక్షాలు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు నిదర్శనం పవన్ చేసిన వ్యాఖ్యలే అని వెల్లడించాయి. ఇక పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ బీజేపీ కపట బుద్ధి మళ్లీ బయటపడిందని అన్నారు. రెండేళ్ల క్రితమే పాక్పై యుద్ధం చేస్తామని పవన్తో బీజేపీ చెప్పిందని ఇలాంటి రాజకీయాలు కమలం పార్టీ చేస్తోందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే రెండేళ్ల క్రితం టీడీపీ కూడా బీజేపీతోనే కలిసి ఉంది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా నాడు వ్యవహరించిన టీడీపీకి తెలియకుండా బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది.

విజయశాంతి కామెంట్స్
నేను ఆరోజే చెప్పాను..ఇప్పుడు పవన్ ధృవీకరించారు: విజయశాంతి
ఇక పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ మీడియాలో కూడా కథనం వచ్చింది. పాక్ పత్రిక డాన్లో పవన్ వ్యాఖ్యలు వచ్చాయి. పాకిస్తాన్తో యుద్ధం చేసి లోక్సభ ఎన్నికలకు వెళతామని బీజేపీ పవన్ కళ్యాణ్ అనే రాజకీయనాయకుడితో చెప్పాయంటూ డాన్ పత్రిక తన కథనంలో వివరించింది. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కూడా స్పందించారు. యుద్ధం పేరుతో బీజేపీ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోందని తాను కొద్ది నెలల క్రితమే హెచ్చరించినట్లు చెప్పిన్న రాములమ్మ...తాను చెప్పిన విషయాన్నే పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా ధృవీకరించారన్నారు.

పవన్ వ్యాఖ్యలను బూచిగా చూపిస్తున్న పాక్ మీడియా
ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్దం గురించి ఈ సమయంలో ఎంత తక్కువగా మాట్లాడితే దేశానికి అంత మంచిదని వారు చెబుతున్నారు. కడప పర్యటనలో పవన్ కళ్యాణ్ అభిమానులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశభక్తి అంశం వచ్చిన సమయంలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశభక్తి బీజేపీకి పేటెంట్ హక్కు కాదన్న జనసేనాని... వారికంటే మాకు ఎక్కువగానే దేశభక్తి ఉందన్నారు.
పవన్ కళ్యాణ్కు ఎవరో కొందరు వ్యక్తులు నిజంగానే చెప్పి ఉంటే ఆరోజే ఎందుకు బయటపెట్టలేదని రాష్ట్ర బీజేపీ ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయంగా బలపడేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని తిప్పి కొట్టింది. మొత్తానికి పాకిస్తాన్ పై యుద్దానికి వెళుతామని పవన్ కళ్యాణ్తో బీజేపీ నిజంగా చెప్పిందా లేదా అన్న విషయాన్ని పక్కకు పెడితే పాకిస్తాన్ మీడియా మాత్రం పవన్ వ్యాఖ్యలతో సంబరాలు చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూపి భారత్పై నెపం నెట్టాలని భావిస్తోంది. భారత్ పాక్పై యుద్ధం చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించుకున్నట్లు పవన్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోందని చెబుతూ... భారత ప్రభుత్వంపై నిందవేసే ప్రయత్నం పాక్ మీడియా చేస్తోంది.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: పవన్
రెండేళ్ల క్రితమే యుద్ధం వస్తుందని బీజేపీ తనతో చెప్పినట్లు వచ్చిన వార్తలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. సోషల్ మీడియాలో యుద్ధం రాబోతోంది అంటూ చర్చలు జరగడం, కొందరు విశ్లేషకులు ఎన్నికలు ముందు యుద్ధం వస్తుందంటూ ఊహించడంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications