''వాస్తవిక దృక్పథంతో జనసేనాని''
జనసేన అధినేత వాస్తవిక ఆలోచనా దృక్పథాన్ని కనపరుస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా ఎవరికి పడితే వారికే మద్దతిస్తాడు.. ఒకరినే వ్యతిరేకిస్తాడు అని అనుకుంటున్నవారికి పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ప్రసంగంద్వారా కొంత సమాధానం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పవన్ మాట్లాడిన మాటల్లో గత ఎన్నికల్లో పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు.. తాను రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యాను అనే బాధకన్నా అభిమానులను ఓటర్లుగా మలచుకోలేకపోయాననే బాధే ప్రస్ఫుటంగా కనపడింది.

ఓట్లుగా మార్చలేకపోతున్నారుగా: సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, క్రేన్లు పెట్టి గజమాలలు వేస్తున్నారని, కానీ ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించలేకపోయారని నేరుగానే నిష్టూరమాడారు. దీన్ని అభిమానులు, పార్టీ శ్రేణులు ఎలా అర్థం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
జనసేనాని గుడ్డిగా చంద్రబాబును సమర్థిస్తున్నాడు.. ఆయన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ సొంత పార్టీలోని, ఇతర పార్టీల్లోని కాపు సామాజికవర్గానికి చెంది నేతలు చేస్తున్న విమర్శలకు సరైన సమాధానం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బలం తెలుసుకొని మాట్లాడాలి: తాను వాస్తవిక దృక్పథంతో ఉన్నానంటున్నారు. మన బలం అంచనా వేసుకోకుండా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి పదవి అడగడమే రాజకీయంగా పరిణతి సాధించలేదనే విషయాన్ని తెలియజేస్తుందని, అలా కాకుండా క్షేత్రస్థాయిలో మనం బలం తెలుసుకొని, మన అవసరాలు తెలుసుకొని వాటిని అసెంబ్లీ వరకు తీసుకురావాలంటే తెలుగుదేశం, బీజేపీ లాంటి పార్టీలతో పొత్తుండాల్సిన అవసరాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టంగా వివరించారు.
రాజకీయంగా పరిణతి: ఈ విషయంలో పవన్ కల్యాణ్ పరిణతి చెందిన రాజకీయవేత్తలా వ్యవహరించారంటున్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీ ఎందుకు పోటీపడలేకపోతోందని, అందుకు కారణాలను విశ్లేషించడంతోపాటు అందుకు జనసేన ఏం చేయాలి? భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలి?
ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే స్పష్టత తన ప్రసంగంద్వారా ఇచ్చారు. ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ, సొంత బలం ఉన్నప్పటికీ ఎన్నికల్లో అది ఓట్ల రూపంలో మారుస్తుందన్న నమ్మకం జనసేనానికి కలగడంలేదు. అటువంటి నమ్మకాన్ని ఆయనకు కల్పించాల్సిన బాధ్యత అభిమానులు, పార్టీ శ్రేణులపైనే ఉంది.












Click it and Unblock the Notifications