అవినీతిలో టిడిపి, వైసిపి దొందూదొందే...వాళ్లు ఇష్టానుసారంగా...వీళ్లు చట్టబద్దంగా:పవన్ కళ్యాణ్
పశ్చిమ గోదావరి:అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష కోట్ల బడ్జెట్ ఎటు వెళ్తోందని జనసేన అధినేత పవన్కళ్యాణ్ నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్రలో భాగంగా తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ, వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు.
తాను ఏ జిల్లాకు వెళ్లినా ఆసుపత్రులు, రోడ్లు, తాగునీరు, నిరుద్యోగం వంటి సమస్యల గురించి జనం చెబుతున్నారని, ఏటా రూ.లక్షల కోట్ల బడ్జెట్ ఏమవుతుందో అర్థం కావడం లేదని పవన్ అన్నారు. వైసీపీ ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే...టీడీపీ చట్టబద్ధంగా దోచుకుంటోందని...అవినీతిలో టిడిపి, వైసిపి దొందూదొందేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. దోపిడి రాజ్యం కోసం తాను టీడీపీకి మద్దతివ్వలేదన్నారు. కులాలను నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని తేల్చిచెప్పారు.
జగన్,చంద్రబాబు...లక్షల కోట్లు
ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో రెండోవిడత పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆకివీడు, తణుకుల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. జగన్ రూ.లక్ష కోట్లు, చంద్రబాబు లక్షన్నర కోట్లు దోచుకున్నారని అంటున్నారని, ఇద్దరూ కలిసి రెండున్నర లక్షల కోట్లు దోచేసి నియోజకవర్గానికి రూ. 25 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. సిఎం చంద్రబాబు ఇంటికి, హెరిటేజ్లో బర్రెలు నడిచేందుకే రోడ్లు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. సిఎం, ఆయన చుట్టూ ఉన్న మంత్రి నారాయణ వంటి సిండికేట్లే బాగుపడుతున్నాయని విమర్శించారు.
Recommended Video
చంద్రబాబు,లోకేషే...అంతా వ్యర్థం
పశ్చిమ గోదావరి జిల్లాలోని సమస్యలపై జగన్, చంద్రబాబు, లోకేష్ వస్తే తాను చర్చకు సిద్దమని సంసిద్దత వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి 15 సీట్లు గెలిచిందంటే అది తన వల్లే అన్నారు. తాను తప్పు మాట్లాడితే రాజకీయాలనుంచి తప్పుకుంటానని పవన్ సవాల్ విసిరారు. చంద్రబాబు రెండు వేళ్లు చూపించడం వెనుక ఆంతర్యం తాను, లోకేష్ మాత్రమే, మీరంతా వ్యర్థమన్నట్లు చూపిస్తారని పవన్ అభివర్ణించారు. ఇరగవరంలో వందల ఎకరాలు, కత్తవపాడులో దొంగ ఖాతాలు తెరిచి రూ.4 కోట్లు దోచేస్తే సిఎంకు రియల్ గవర్నెన్స్లో కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కాపులకు...అన్యాయం
అగ్రకులాల్లోని పేదలకు న్యాయం జరగాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చంద్రబాబు కాపుల ఓట్లు వేయించుకున్నారని..కానీ వారికి న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల శాతాన్నిపెంచాలని పవన్ వ్యాఖ్యానించారు. బిసిలకు ఎంతోచేసినట్లు చెప్పుకుంటున్న టిడిపికి తెలంగాణాలో జండా కట్టేవాళ్లే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టో విడుదల చేస్తామని పవన్కళ్యాణ్ తెలిపారు. తనకు జగన్, లోకేష్లా అర్జెంట్గా ముఖ్యమంత్రి అయిపోవాలని లేదన్నారు. ముఖ్యమంత్రి పదవికంటే మార్పును తాను ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.సిపిఎస్పై శాసనసభలో పెట్టి రద్దు చేసే విధంగా మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పారు.
మద్యం వద్దంటే...రద్దు చేస్తా
సిపిఎస్పై శాసనసభలో పెట్టి రద్దు చేసే విధంగా మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మద్యం విక్రయాలు వద్దని మహిళలు చెపితే...మద్యం దుకాణాలను రద్దు చేసేందుకు జనసేన కృషి చేస్తుందని పవన్ ప్రకటించారు. ప్రభుత్వం పేద ప్రజలకు రూపాయికి కిలో బియ్యం ఇస్తామని చెప్పి తినడానికి పనికిరానివి ఇస్తోందని, అందుకు బదులుగా గృహిణుల ఖాతాలో రూ.2,500 నుంచి రూ.3,500 వరకూ జమ చేసేలా జనసేన చర్యలు తీసుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు.
పవన్...కార్యక్రమం రద్దు
ఇదిలావుండగా క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి సమావేశ ప్రాంగణంలోని అల్లూరి విగ్రహానికి జనసేనాని పూలమాలలు వేసే కార్యక్రమం రద్దయ్యింది. క్షత్రియ సామాజిక వర్గంలోని కొందరు పవన్ను పూలమాలలు వేయటానికి ఆహ్వానించినట్లు సమాచారం. అందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించగా ఆ క్రమంలో పవన్ సెక్యూరిటీ సిబ్బంది ముందుగా వచ్చి తనిఖీలు చేపట్టారు. ఇది గమనించిన కొందరు యువకులు విషయం తెలుసుకొని పవన్ ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారని... ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న సమావేశమని, దీనికి పవన్ను ఆహ్వానించడం ఏమిటంటూ కొందరు అభ్యంతరం లేవనెత్తారు. దీంతో పవన్ వస్తే గందరగోళం చెలరేగే అవకాశం ఉండటంతో బౌన్సర్లను పోలీసులు హెచ్చరించడంతో వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. దీంతో పవన్ పర్యటన రద్దయ్యింది.