‘వన్ఇండియా’కే మా మద్దతు: పాక్ను ఏకేసి, భారత్ గొప్పతనంపై పవన్(వీడియో)
హైదరాబాద్: 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను పాఠశాల స్థాయి నుంచే దేశ స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలు చదివానని, వారు చేసిన త్యాగాలు, పోరాటాలు గురించి తెలుసుకొని ఎంతో స్ఫూర్తి పొందానన్నారు.
పాలస్తీనా చూస్తే ఆ బాధ తెలుస్తుంది..
దేశం ఉండటం ఎంత అవసరమో.. దేశమే లేని ప్రజలను, పాలస్తీనా పౌరుల్ని అడిగితే ఆ బాధేంటో తెలుస్తుందని అన్నారు. దేశానికి విలువ, గౌరవం ఇవ్వాలని ఎంతమందికి తెలుసని పవన్ ప్రశ్నించారు. దేశం కానీ దేశం వెళ్లినప్పుడు, ఒంటరిగా ఫీలైనప్పుడు మన దేశం విలువ ఎంటో తెలుస్తుందని అన్నారు.
అప్పుడు అనేక దారుణాలు..
పాలస్తీనా వెళ్లినప్పుడు వాళ్లకు దేశం కావాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్లకు దేశమే లేదని చెప్పారు. మన దేశంలో అనేక సంస్థానాలుండేవి.. అనేక పోరాటాల అనంతరం మనకు స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. భారతదేశం నుంచి పాకిస్థాన్ దేశంగా ఎన్నిలక్షల మంది నరకబడ్డారు? ఎన్ని లక్షల మంది మహిళలు మానభంగాలు చేయబడ్డారు.. అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా గుండెతరుక్కుపోతుందని అన్నారు.
మనమంతా ఒక్కటే..
‘నిజంగా ప్రతీ ఒక్కరూ మన దేశ చరిత్ర చదవాలి. భగత్ సింగ్, గాంధీ, అంబేద్కర్ లాంటి అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రను తెలుసుకోవాలి. మన అదృష్టం ఇలాంటి దేశం మనకుంది. అనేక భిన్న సంస్కృతులు, భాషలున్నాయి. కన్నడ దేశం, ఆంధ్ర దేశం అని ఉన్నాయి. ఒకసారి కాశ్మీర్ వెళ్లినప్పుడు మద్రాసు దేశం నుంచి వచ్చారా? అని అడిగారు. ఇంకా ప్రజలు మనమంతా ఒకదేశంలో ఉన్నామని తెలుసుకోవడం లేదు. ఆ గ్యాప్ ఉండకూడదు' అని పవన్ అన్నారు.
మన దేశం గొప్పది..
‘మన దేశం గొప్పది అని ఎందుకంటున్నానంటే.. పాకిస్థాన్ దేశంలో ఒక హిందూ ప్రధానిని గానీ, రాష్ట్రపతిని గానీ చూడలేం. కానీ ఈ దేశం తాలూకు గొప్పతనం ఏంటంటే.. ఒక ముస్లింని.. అంటే అబ్దుల్ కలాం, జాకీరుస్సేన్ లాంటి వ్యక్తలను రాష్ట్రపతిని చేసింది. ఫాంటియర్ గాంధీ అని చెప్పుకునే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ను ఎంత గౌరవిస్తామో తెలిసిందే' అని చెప్పుకొచ్చారు.
పాక్ను నిలదీసిన పవన్
అంతేగాక, ‘ఇటీవల ఓ పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నేత(ఇమ్రాన్ ఖాన్) మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకమత్వం భారతదేశంలో మిస్సవుతోందని ఆవేదనగా మాట్లాడుతున్నారు. అప్పుడు నాకనిపించింది. మనసులో ఓ ప్రశ్న మెదిలింది. ఎప్పుడైనా సరే ఒక హిందువును పాకిస్థాన్ ప్రెసిడెంట్గా మీరు(పాక్ రాజకీయ నేత) చూపించగలరా?.. హిందువుల ప్రాణాలకు మీరు నిజంగా రక్షణ కల్పించగలరా? ఇవన్నీ చూస్తే మన భారతదేశంలో ఇలాంటి ఇబ్బంలేమీ లేవు. కొన్ని చోట్ల ఉన్నాయి. అవి ఏదేశంలోనైనా ఉండేవే. ఏ కులమైనా.. ప్రాంతమైనా.. మతమైనా.. ఒకరికి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్లకు మద్దతుగా నిలిచి.. వాళ్ల తరపున వినిపించే కొన్ని కోట్ల గొంతుకలున్నాయి ఈ దేశంలో' అని భారత్ గొప్పదనాన్ని వివరించారు పవన్.
‘వీ స్టాండ్ ఫర్ వన్ఇండియా'..
‘పాకిస్థాన్కి , ఇమ్రాన్ ఖాన్కి చెప్పదలచుకున్నా.. ఈ దేశంలో ఎంత స్వేచ్ఛ ఉందంటే ఒక హిందూ దేవున్ని కూడా తిట్టి.. అందరూ అర్థం చేసుకోగల అంత సహనం ఉంది ఈ దేశంలో. నేనేం కోరుకుంటున్నానంటే ఈ దేశంలో.. ప్రతీ ఒక్కరూ పరమత సహనం పాటించాలి. అర్థం చేసుకోవాలి. భిన్న సంస్కృతులను అర్థం చేసుకోవాలి. అంతేగానీ, ఒక భాషను గానీ, ఒక సంస్కృతిని గానీ మిగితా వాళ్లపై రుద్దితే అసమనాతలకు, గొడవలకు దారితీస్తాయి. అలాగే అలాంటివి జరగకుండా ఉన్నత ఆలోచనలు గల రాజకీయ నాయకులు.. సామాన్య ప్రజల్లోకి, యువతలోకి, పిల్లల్లోకి వాళ్ల భావ జాలంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. జనసేన తరపున నేను కోరుకునేదేమీటంటే.. పోరాటం చేసి కూడా.. ఈ దేశం అందరిది. అన్ని కులాలు, మతాలు, భాషలకు సమానమైనది. మధ్యలో కొందరు వారి ఆలోచనల విధానాలను బట్టి, వారి స్వార్థాన్ని బట్టి దేశాలను రకారకాలుగా విభజించవచ్చు గానీ.. స్విరిట్ ఆఫ్ నేషన్.. స్పిరిట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్.. అల్వేస్ యూనైటెడ్. వీ స్టాండ్ ఫర్ వన్ఇండియా.. వీ స్టాండ్ ఫర్ వన్ భారత్. జై హింద్' అని పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.