నో డౌట్... గట్టిగా 'క్లాస్' పీకిన పవన్ కల్యాణ్!
బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రతిభావంతుడుగా పేరు తెచ్చుకున్న సముద్రఖని ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో కూడా ఆయనే దీనికి డైరెక్షన్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ఇది. ఈనెల 28వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత.
తమిళ సినిమాల్లో తమ రాష్ట్రానికి చెందినవారినే తీసుకోవాలని, అత్యవసరమైతేనే షూటింగ్ లు బయట చేయాలని తమిళ నటీనటుల సంఘం మార్గదర్శకాలను జారీచేసింది. దీనిపై తెలుగు పరిశ్రమ నుంచి ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. అయితే పవన్ కల్యాణ్ తొలిసారిగా దీనిపై మాట్లాడారు. సముద్రఖని తమిళుడేనని, సినిమాకు ఛాయాగ్రహణం నిర్వహించిన సుజిత్ ది కేరళ అని, స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలాది ముంబయి అని.. విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైన ఇంతమంది ఒకచోట కలిస్తేనే నాణ్యమైన సినిమా రూపుదిద్దుకుందన్నారు.

ఇలా అందరూ కలిస్తేనే గొప్ప చిత్రాలను తీయగలమంటూ తమిళ పరిశ్రమకు హితవు పలికారు. రోజా, జెంటిల్ మెన్ లాంటి సినిమాలను తమిళ పరిశ్రమకు అందించిన ఏఎం రత్నం తెలుగువాడేనని ఉదహరించారు. వాస్తవానికి రత్నం తీసింది ఖుషి, భారతీయుడు, బాయ్స్ సినిమాలు. పవన్ ఉదాహరణ కోసం చెప్పినవి కావడంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.
తమిళులకే అవకాశాలివ్వాలనడం సరైన చర్య కాదన్నారు. అంతేకాకుండా కర్ణాటక నుంచి వచ్చిన రజనీకాంత్ ను, తెలుగు మూలాలున్న విశాల్ ను కూడా బయటకు పొమ్మంటారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని, ఈ విషయంలో పొన్నియన్ సెల్వన్ వెనకబడటానికి కారణం తమిళ వాసన ఎక్కువవడంవల్లేకదా అని ఉదహరిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి అంతర్జాతీయస్థాయి సినిమాలు వచ్చి చాలాకాలం అవుతోందని.. ఒకసారి వారికి వారే ప్రశ్నించుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications