ఢిల్లీకి పవన్ కళ్యాన్ : అమిత్ షాతో భేటీ..! బీజేపీ..జనసేన మధ్య పొత్తు పొడిచేనా..!
ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆకస్మికంగా ఢిల్లీ పర్మటనకు వెళ్లారు. ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఏపీలో టీడీపీ..వైసీపీక ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. జనసేనను బీజేపీలో విలీనం చేయాలని అమిత్ షా కోరారని గతంలోనే పవన్ పలు సందర్భాల్లో చెప్పారు.
అందుకు పవన్ ససేమిరా అన్నారు. ఇక, బీజేపీతో పొత్తు దిశగా అమెరికాలో జరిగిన తానా సభల వేదికగా చర్చలు మొదలయ్యాయి. బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ నేరుగా పవన్ తోనే చర్చించారు. ఇక, ఇప్పుడు పవన్ ఢిల్లీ పర్యటనలలో అమిత్ షా ను కలుస్తారనే వార్తల ద్వారా తిరిగి..ఏపీలో బీజేపీ..జనసేన పొత్తుతో ముందుకు సాగుతారా అనే ఆసక్తి కర చర్చ మొదలైంది.
బీజేపీ..జనసేన మధ్య పొత్తు దిశగా..
ఏపీలో చంద్రబాబు..జగన్ ను దెబ్బతీసి సొంతంగా ఎదగాలంటే ఇప్పుడు తమకు ఉన్న శక్తి చాలదని బీజేపీ గ్రహించింది. దీంతో..ఏపీలో సామాజిక సమీకరణాల ఆధారంగా జరిగే రాజకీయ పోరులో టీడీపీ..వైసీపీకి భిన్నమైన వర్గాలను దగ్గరకు తీసుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా 2014 ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన పవన్ ను ఏపీలో కలుపుకుపోవాలని చాలా కాలంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ అమెరికాలో తానా వేదికగా పవన్ తో చర్చలు చేసారని అప్పట్లోనే జోరుగా ప్రచారం సాగింది. అయితే, బీజేపీ తొలుత పార్టీ విలీనం ప్రతిపాదించగా..వపన్ సాధ్యం కాదని తేల్చేసారు. దీంతో..ఇప్పుడు పొత్తు దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.
చాలా కాలంగా పవన్ సంకేతాలు..
అమెరికాలో రాం మాధవ్ తో మంతనాల తరువాత పార్టీ నేతలతో అనేక సార్లు పవన తన పార్టీ ఎందులోనూ విలీనం కాదని పదే పదే చెప్పుకొచ్చారు. అదే సమయంలో పొత్తు ఉండదని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఇక, ఏపీలో ఇప్పుడు టీడీపీ..వైసీపీని ఎదుర్కోవాలంటే పవన్ కు బీజేపీ సహకారం..అదే విధంగా బీజేపీకి జనసేన అవసరం ఉన్నాయి. దీంతో..బీజేపీ నేతలు సైతం పవన్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఉన్నారు.
బీజేపీ..వపన్ మధ్య కొద్ది రోజులుగా స్నేహం కోసం సాగుతున్న ప్రయత్నాలను పసి గట్టిన చంద్రబాబు ముందుగా టీడీపికి పవన్ ను దగ్గర చేసుకొనేందుకు ప్రయత్నాలు చేసారు. అవి కొంత వరకు సఫలం అయినా..టీడీపీతో కలిస్తే..తాము దూరంగా ఉంటామని బీజేపీ స్పష్టం చేసింది .దీంతో.. పవన్ కొద్ది కాలంగా గతం కంటే భిన్నంగా మోదీ..అమిత్ షాలను అభినందిస్తూ..వారితో తనకున్న పరిచయాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా సంకేతాలిచ్చారు.
అందులో భాగంగానే టార్గెట్ జగన్..
ఏపీలో అమరావతి వివాదంతో పాటుగా తాజా సమస్యల పైన పవన్ కొద్ది రోజులుగా యాక్టివ్ గా పోరాటం చేస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఎన్నికల వరకూ ప్రధాని పైన తీవ్రంగా విమర్శలు చేసిన పవన్.. ఇప్పుడు బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవటం పైన కొందరు ఏపీ నేతలు ఈ ప్రతిపాదన వచ్చిన సమయంలోనే అభ్యంతరం వ్యక్తం చేసారు.
అయితే, పవన్ ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా బీజేపీతో పొత్తు పెట్టుకొని..కలిసి ప్రయాణించాలని భావిస్తే.. ముందుగా ప్రత్యేక హోదా పైన స్పష్టత ..వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, పవన్ ఢిల్లీలో ఎవరితో కలుస్తారు.. ఏం చర్చిస్తారు అనే దానికి అనుగుణంగా పరిణామాలు..సమీకరణాలు మారే అవకాశం ఉంది.