రుతుపవనాలు రివర్స్.. బంగాళాఖాతంలో ఒకేసారి రెండు అల్పపీడనాలు!
దేశవ్యాప్తంగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయనుకుంటున్న వేళ.. వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంతో పాటు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఒకేసారి రెండు వేర్వేరు వాతావరణ వ్యవస్థలు చురుగ్గా మారుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఇవి మరింత బలంగా మారి నైరుతి రుతుపవనాలకు సరికొత్త జీవాన్ని పోసే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత మళ్లీ పెరగనుందని వాతావరణ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆకాశంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనం ఉత్తర బంగాళాఖాతం వైపు వేగంగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ఈ వారాంతానికి వాయువ్య బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం బలపడేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనప్పటికీ.. రాబోయే రోజుల్లో ఇది తీవ్రరూపం దాల్చి దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షాలకు కారణమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుత వ్యవస్థతో వర్షాల హోరు!
ఇప్పటికే ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి. రుతుపవనాల ద్రోణి ఈ అల్పపీడనం గుండా ప్రయాణిస్తూ ఉత్తర బంగాళాఖాతం వైపు సాగుతుండటంతో మధ్య, ఉత్తర , తూర్పు భారత ప్రాంతాల్లో వర్షాపాతం స్థిరంగా నమోదువుతోంది. సముద్రం నుంచి వచ్చే తేమగాలులను ఈ వ్యవస్థలు భూభాగం వైపు లాక్కోవడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాలకు అలర్ట్!
రాబోయే రోజుల్లో తూర్పు, మధ్య భారతదేశంలో వర్షాల ధాటి మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో అక్కడక్కడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. బంగాళాఖాతంలో కొత్తగా పుట్టుకొస్తున్న అల్పపీడనం ఎంత బలంగా మారుతుంది, అది ఏ దిశగా పయనిస్తుంది అనే దానిపై రాబోయే రెండు రోజుల్లో మరింత స్పష్టత రానుంది.














Click it and Unblock the Notifications