రెండు నౌకల్ని హైజాక్ చేసిన సముద్రపు దొంగలు..! 22 మంది భారతీయులు..!
గల్ఫ్ తీరం, ఎర్రసముద్రంలో ఉద్రిక్త పరిస్ధితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ఇరాన్ పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తుంటే.. దాన్ని అడ్డుకునేందుకు ఇతర ప్రాంతాల్లో పేరేట్లు (సముద్రపు దొంగలు) రెచ్చిపోతున్నారు. తాజాగా యెమెన్, సోమాలియా తీరాల్లో రెండో వేర్వేరు నౌకల్ని (Ships) సముద్రపు దొంగలు హైజాక్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో మొత్తం 22 మంది భారతీయులు చిక్కుకున్నారు.
యెమెన్, సోమాలియా తీరాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో రెండు నౌకల్ని సాయుధ సముద్రపు దొంగలు ఎత్తుకెళ్లినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. వీటిలో 22 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నట్లు తెలిపింది. అయితే ఆ రెండు నౌకల్లోని భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. వీటిలో మొదటి నౌక కామెరూన్ జెండా కలిగిన ఎంవీ లుటుఫ్ కాగా.. ఇందులో ఆరుగురు భారతీయులతో సహా 10 మంది సిబ్బంది ఉన్నారు. ఇది ఆగస్టు 17న సోమాలియాలోని పుంట్లాండ్ తీరంలో హైజాక్కు గురైంది.

అలాగే రెండవ నౌకను ఎరిట్రియా జెండా కలిగిన ఎంటీ. సిబు 1 (M.T.Sibu 1)గా గుర్తించారు. ఈ నౌకలో 16 మంది భారతీయులతో సహా 20 మంది సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది. తొలి నౌక ఎత్తుకెళ్లిన సరిగ్గా మూడు రోజుల తర్వాత అంటే ఆగస్టు 20న యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో రెండో నౌక హైజాక్కు గురైనట్లు షిప్పింగ్ మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే వీటిని తిరిగి పట్టుకునేందుకు పైరేట్లతో చర్చలు జరిపి భారతీయుల్ని క్షేమంగా అప్పగించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మూడు రోజుల వ్యవధిలో ఇలా రెండు నౌకలు హైజాక్ కావడంతో ఈ ప్రాంతంలో ప్రయాణాలపై టెన్షన్ పెరుగుతోంది.














Click it and Unblock the Notifications