SIR పై వైసీపీ ఫీడ్ బ్యాక్ ఇదే- పార్టీ నేతలతో సజ్జల కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)ఇవాళ పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. సర్లో రెండో విడత కార్యక్రమం దాదాపు పూర్తవుతున్నందున మ్యాపింగ్, నాన్-మ్యాపింగ్, గైర్హాజరు, చిరునామా మార్పులు, డూప్లికేట్, మరణించిన ఓటర్లకు సంబంధించిన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలుకు నెలాఖరు వరకు మాత్రమే సమయం ఉన్నందున పార్టీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని కోరారు.
అదే సమయంలో నాలుగైదు నెలలుగా బూత్ స్థాయిలో బీఎల్ఏలు చురుకుగా పనిచేయడం వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవడంలో మంచి పురోగతి సాధించినట్లు సజ్జల తెలిపారు. ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన నేపథ్యంలో తొలగింపులకు సంబంధించిన వివరాలను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమన్నారు. అర్హులైన ఓట్లు తొలగించే పరిస్థితిలో ఉంటే సంబంధిత ఫారాలను సమర్పించి వాటిని తిరిగి జాబితాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లుగా భావించిన వాటిపై అవసరమైన అభ్యంతరాలను సమర్పించాలని చెప్పారు. పార్టీ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించిన సుమారు 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లను బూత్ స్థాయిలో పరిశీలించాలని సజ్జల సూచించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని, పార్టీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సజ్జల తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగస్టు 25న కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారన్నారు.














Click it and Unblock the Notifications