ఎంపీగా పవన్ పోటీ, బీజేపీ ఫార్ములా వెనుక - కలిసొచ్చేదెవరికి..!!
ఏపీ ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తీసుకుంటోంది. జగన్ కు వ్యతిరేకంగా 2014 తరహా కూటమి సిద్దమైంది. టీడీపీ, బీజేపీ, జనసన ఒక్కటయ్యాయి. సీట్ల పంపకాల పైన సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చాయి. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ సూచించింది. ఇదే ఇప్పుడు అసలు ట్విస్ట్ గా మారుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పవన్ పవర్ షేరింగ్ తీసుకోవాలని జనసేన నేతలు కోరుకుంటున్నారు. మరి..ఈ నిర్ణయంతో జరిగేదేంటి.
పొత్తుల లెక్కలు : బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైంది. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. సీట్ల పంపకాల పైన అవగాహనకు వచ్చినా.. అధికారికంగా ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే స్పష్టత రావాల్సి ఉంది. సూత్రప్రాయంగా మాత్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయించారు. పవన్ బీజేపీ కోసం ఒక సీటు త్యాగం చేసారు. రెండు ఎంపీ సీట్లకు పరిమితం అవుతున్నారు. బీజేపీకి 6 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతున్నా..అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో పవన్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దాని పైన కొంత కాలంగా పలు అంచనాలు చర్చకు వచ్చాయి. కానీ, పవన్ ఎంపీగా బరిలోకి దిగుతున్నారు.

ఎంపీగా పవన్ పోటీ : పవన్ కల్యాన్ ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయటం ఖాయమైందని తెలుస్తోంది. బీజేపీ నాయకత్వ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పవన్ ఎంపీగా గెలవటం ద్వారా కేంద్రంలో మంత్రి వర్గంతో అవకాశం దక్కుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ పూర్తిగా ఏపీ పైనే ఫోకస్ చేసారు. ఏపీలో జగన్ ను ఓడించి తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది తన లక్ష్యంగా చెబుతున్నారు. పలు హామీలను ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పవన్ - చంద్రబాబు పవర్ షేరింగ్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. సీఎం పదవి దక్కకపోతే డిప్యూటీ సీఎంగా ఉంటారనే ప్రచారం జనసేనలో జరిగింది. అయితే, పవన్ కు రాష్ట్రంలో అధికారికంలోకి వచ్చిన ఎలాంటి ప్రాధాన్యత ఉండదనే అభిప్రాయం స్పష్టమవుతోంది. ఎంపీతో పాటుగా ఎమ్మెల్యేకు పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే రెండిటా గెలిచినా..ఏ స్థానం నిలబెట్టుకుంటారనే ప్రశ్న ఎన్నికల ప్రచారంలో తలెత్తే అవకాశం ఉంటుంది.

లాభమా - నష్టమా : అయితే, అసలు పవన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించటం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. పవన్ 2014లోనూ టీడీపీ, బీజేపీతో కలిసి పని చేసారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఎలాంటి హోదా తీసుకోలేదు. నాడు ఇచ్చిన హామీలన చంద్రబాబు అమలు చేయలేదని ఇప్పటికీ వైసీపీ విమర్శిస్తోంది. పవన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిని చేసి ఇచ్చే అవకాశం ఉన్నా బీజేపీ ఎందుకు చేయలేదనే ప్రశ్న మొదలైంది. అయితే, పవన్ ఎంపీగా పోటీ చేయటం ద్వారా కాకినాడ ఎంపీ స్థానంతో పాటుగా పరిధిలోని అసెంబ్లీ నియోకవర్గాల్లోనూ కలిసి వస్తుందని విశ్లేషిస్తున్నారు. అయితే, పవన్ ఎమ్మెల్యేగా కాకుండా..ఎంపీగా పోటీ చేస్తే కొత్త సందేహాలకు అవకాశం ఇచ్చినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, పవన్ ఎంపీగా పోటీ చేయటం పొత్తుకు కలిసి వస్తుందా..లేదా అనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications