ప్రధాని మీటింగ్ కు పవన్ దూరం - టీడీపీ నుంచి ఆ ఇద్దరూ : రోజా - చిరంజీవి సైతం..!!
ప్రధాని మోదీ పర్యటనకు జనసేన అధినేత పవన్ దూరంగా ఉండనున్నారు. ఏపీలో బీజేపీ - జనసేన రాజకీయంగా మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఏపీకి ప్రధాని వస్తున్న సమయంలో పర్యటనకు దూరంగా ఉండాలనే పవన్ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ప్రధాని రాక పైన పవన స్పందించారు. ఈ మేరకు ఒక వీడియో విడదల చేసారు. అందులో.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అద్భుతమైన కార్యక్రమం గా ప్రశంసించారు. దక్షిణ భారతదేశానికి చెందిన మహాయోధుడి గొప్పతనం గురించి యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి చేస్తున్న కార్యక్రమం అభినందనీయమననారు.
పవన్ సొంత నియోజకవర్గంలో
అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ చేయడానికి వస్తున్న ప్రధానికి ఆయన జనసేన తరపున శుభాభివందనాలు తెలిపారు. భీమవరంలో పోటీ చేసిన తనకు ఇది ప్రత్యేకమని అభివర్ణించారు. పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పవన్ సూచించారు. ఇక, టీడీపీ నుంచి ప్రధాని కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు.. ఉండి ఎమ్మెల్యే శివ రామ రాజు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర మాజీ మంత్రి.. సినీ హీరో చిరంజీవిని ఆహ్వానించారు. ఆయన హాజరు అవుతున్నట్లు కార్యక్రమ నిర్వహకులకు సమాచారం అందింది.
చిరంజీవి హాజరవుతున్నారంటూ
తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం..అందునా అల్లూరి సీతారామ రాజు కు గౌరవంగా నిర్వహిస్తుండటంతో హాజరవ్వాలని చిరంజీవి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా అధికారిక హోదాలో ప్రత్యేకాకర్షణగా నిలవనున్నారు. ఏపీ టూరిజం శాఖా మంత్రిగా ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకం కానున్నారు. ప్రధాని రాక.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి నేడు అన్ని దిన పత్రికల్లో ప్రభుత్వం తరపున రోజా తన శాఖ నుంచి భారీ ప్రకటనలు ఇచ్చారు. కార్యక్రమానికి వస్తున్న ప్రధానికి స్వాగతం పలికారు.
ఏపీ ప్రభుత్వం తరపున రోజా లీడ్
అదే విధంగా పలువురు ప్రవాసాంధ్రులు సైతం ఈ కార్యక్రమానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అల్లూరి వారసులకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. అల్లూరి జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వంశీయులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. అల్లూరి అనుచరుల్లో ఒకరైన గంటం దొర వారసులైన బోడి దొర కుటుంబ సభ్యులూ వచ్చారు. వారితో ప్రధాని మాట్లాడనున్నారు. దీంతో.. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.