పవన్ కల్యాణ్ మిషన్ 34 - మారుతున్న లెక్కలు, కీలక నిర్ణయం..!!
ఏపీ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. పొత్తులు ఖాయంగా కనిపిస్తున్నా...తెర వెనుక రాజకీయం ఊపందుకుంది. మఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సమయంలో ఏపీ రాజకీయాల పైన కీలక నిర్ణయాలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమయంలో ఎన్డీఏలోకి టీడీపీ రీ ఎంట్రీ పైన సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కార్యాచరణ వేళ పవన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
పవన్ వేచి చూస్తున్నారా : బీజేపీ, టీడీపీతో కలిసి వెళ్లాలనేది పవన్ ఆలోచన. బీజేపీ నిర్ణయం ఏంటనేది ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 18న ఎన్డీఏ పక్షాలతో బీజేపీ నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసింది. గతంలో ఎన్డీఏలో పని చేసి..దూరమైన వారిని దగ్గర చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీతో మైత్రి దిశగా అవకాశాలు ఉన్నాయి.

కానీ, ఇప్పటి వరకు టీడీపీకి ఆహ్వానం అందలేదు. ఇదే సమయంలో ఎన్డీఏలో జనసేన ఇప్పటి వరకు భాగస్వామి కాకపోయినా..బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. దీంతో, పవన్ కు ఆహ్వానం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీ కావాలని కోరుకుంటున్న పవన్.. బీజేపీ తాము టీడీపీతో కలవమని చెప్పే పరిస్థితి వస్తే పవన్ నిర్ణయం కీలకం కానుంది.
వారాహి రెండో విడత యాత్ర : పవన కల్యాన్ బీజేపీ కంటే టీడీపీ వైపే మొగ్గు చూపుతారనే అంచనాలు ఉన్నాయి. పవన్ అసలు లక్ష్యం జగన్ ను ఓడించటం. రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ఎదగటం..సీట్లు సాధించటం. ఇందుకోసం టీడీపీతో నే కలిసి వెళ్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పవన్ కల్యాణ్ మిషన్ -34 పైనే ప్రధానంగా ఫోకస్ చేసారు.
గోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో వైసీపీని ఓడిస్తానని శపథం చేసారు. అక్కడ పాగా వేస్తే అధికారం దగ్గరైనట్లేనని భావిస్తున్నారు. తొలి విడత వారాహి సక్సెస్ అయిందని చెబుతున్న జనసేన..ఇప్పుడు పవన్ కల్యాణ్ రెండో విడత యాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఏలూరులో రెండో విడత యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

కీలక నిర్ణయాల దిశగా పవన్ : గోదావరి గట్టున యాత్ర ప్రారంభించిన పవన్ జున్ 14 నుంచి 30వ తేదీ వరకు కత్తిపూడి నుంచి భీమవరం వరకు పర్యటించారు. వివిధ మార్గాల్లో ఆయన బహిరంగసభలు ఏర్పాటు చేశారు. ఏలూరు, దెందులూరు , తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నేతలు తమ నియోజకవర్గాల్లో పవన్ యాత్రకు ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. ఆ నియోజకవర్గాల నేతలు పవన్ తో సమావేశం కానున్నారు.
రాజమండ్రిలో జరిగే సభలో రెండో విడత యాత్ర రూట్ మ్యాప్ ఫైనల్ చేయనున్నారు. ఎన్నికలయ్యే వరకూ జనంలోనే ఉండాలని పవన్ డిసైడ్ అయ్యారు. నియోజకవర్గాల్లో సమస్యలను ప్రస్తావిస్తూ లోకల్ టచ్ ఇస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక పైనా కసరత్తు చేస్తున్నారు. బీజేపీ పొత్తులపై తేల్చిన తరువాత పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications