ఎటు చూసినా అవినీతే.!రాష్ట్రాన్నిఅప్పులపాలు చేసారు.!రెండేళ్ల జగన్ పాలనపై జనసేన ఫైర్.!
అమరావతి/హైదరాబాద్ : వైయస్సార్ సీపి రెండేళ్ల పాలన పై జనసేన పార్టీ భగ్గుమంది. వైసీపీ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో అప్పులు చేసి, అవినీతికి పాల్పడింది తప్ప మరో కార్యక్రమం చేయలేదని మండిపడింది. నవరత్నాలు, సంక్షేమ పథకాల ముసుగులో ప్రజల్ని మాయ చేశారు తప్ప మంచిపనులు చేయలేదని ఘాటుగా విమర్శించింది జనసేన. రెండేళ్ల వ్యవధిలో 73 లక్షల మంది సామాన్యులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఐన తొలి రోజుల్లోనే ఇసుక కొరత సృష్టించి 40 లక్షల మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని, ఆ సమస్య ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని జనసేన ఆవేదన వ్యక్తం చేస్తోంది. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వైఫల్యాలను వెల్లడించారు ఆ పార్టీ నేతలు.
రెండేళ్లలో వైసిపి చేసిందేమీ లేదు..సంక్షేమ పథకాల ముసుగులో సీఎం మాయ చేసారన్న జనసేన..
సీఎం జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన గురించి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేశామని చెబుతున్నారని, దమ్ముంటే రెండేళ్ల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై కూడా స్పందించాలని జనసేన సవాల్ విసిరింది. అవినీతితో కూడిన పాలన, రెండు సంవత్సరాల్లో రెండు లక్షల కోట్ల రూపాయిలు అప్పులు చేశారని, దుబారా ఖర్చులు చేసి లక్ష కోట్ల రూపాయిలు దోచుకున్న మాట వాస్తవం కాదా? అని జనసేన సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారయ్యిందని, అభివృద్ధి అటకెక్కిందని జనసేన ఆరోపిస్తోంది.
ఇసుక... మట్టి దోచేస్తున్నారు..ప్రజల పక్షాన నిలబడతామన్న జనసేన
వైసీపి పాలన ఉదయించే సూర్యుడి మాదిరి లేదని అస్తమించడానికి సిద్ధంగా ఉన్న సూర్యుడిలా ఉందని జనసేన నేతులు ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో ఏ మూలనైనా అభివృద్ది జరుగుతోందా? నిరుద్యోగులకు ఏ మూలనన్నా ఉద్యోగాలు దొరుకుతున్నాయా? వీటన్నింటి గురించి వైసీపీ నాయకులకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ గురించి, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణ మాఫీ గురించ ఎందుకు మాట్లాడరని నిలదీసింది జనసేన. వైసీపీ అధికారం చేపట్టిన మొదటిరోజు నుంచి ఇసుక, మట్టి దోపిడీ సాగుతోందని జనసేన ధజమెత్తింది.
రాజధాని లేకుండా చేశారు.. రెండేళ్లలో అభివృద్ది శూన్యమన్న పవన్ కళ్యాణ్..
పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక అభివృద్ధి అట్టడుగుకు చేరిందని, రాష్ట్రం నుంచి సుమారు లక్షా 50 వేల కోట్ల రూపాయిల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, వైసీపి పాలనలో ఒక్క పరిశ్రమ వచ్చింది లేదని, రాష్ట్రంలో సుమారు 32 లక్షల మంది పైగా నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని జనసేన స్పష్టం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఒక్క వైసీపీ నేత కూడా మాట్లాడలేకపోవడం దురదృష్టకరమని జనసేన విచారం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందో తెలియని గందరగోళ పరిస్థితి సృష్టించిన వైసీపి, తమ పాలన గొప్పదని ఎలా సమర్ధించుకుంటుందని జనసేన నిలదీస్తోంది.
మద్య నిషేధం అమలు ఏమైంది..? ప్రతిపథకంలో తిరకాసు ఉందన్న జనసేన..
అంతే కాకుండా దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి మహిళల ఓట్లు దండుకుని అదికారంలోకి వచ్చాక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించడం ఎంతవరకు సమంజసమని జనసేన సూటిగా ప్రశ్నిస్తోంది. ఫించన్, ఇళ్ల పట్టాల వంటి పథకాలకు నిబంధనల పేరుతో అర్హులైన పైదవారిని పక్కన పెట్టేశారని, తెల్ల కార్డులను పూర్తిగా రద్దు చేశారని, నిబంధనల పేరిట ప్రతి పథకంలో కోతలు విధిస్తున్నారని జనసేన ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల మీద స్పందిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది జనసేన. వైసీపీ 151 మంది ఎమ్మెల్యేల బలం ప్రజా క్షేత్రంలో ఆవిరైపోయే రోజులు దగ్గర పడ్డాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏ కావాలని జనసేన సూటిగా ప్రశ్నిస్తోంది.
Recommended Video