కోనసీమలో పవన్ వారాహి ఎంట్రీ-అందరి కళ్లూ ఆ నియోజకవర్గం పైనే..
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి యాత్ర చేపట్టారు. కాకినాడ జిల్లాలో హాట్ హాట్ గా సాగిన వారాహి యాత్ర నిన్న కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉదయం జనవాణిలో భాగంగా రైతులు, రైతు సంఘాలు, వాణిజ్య సంఘాలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. సాయంత్రం బహిరంగసభకు సిద్ధమవుతున్నారు.
ముమ్మిడివరం తర్వాత పవన్ కళ్యాణ్ రేపు అమలాపురం వెళ్లబోతున్నారు. రేపు ఉదయం అమలాపురంలో జనవాణి నిర్వహించిన తర్వాత.. సాయంత్రం బహిరంగసభ నిర్వహిస్తారు. అనంతరం 24వ తేదీ పి.గన్నవరం నియోజకవర్గంలో వారాహి యాత్ర మొదలుపెట్టి అక్కడి నుంచి రాజోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. అయితే 25వ తేదీన రాజోలులో జనవాణి నిర్వహించి అదే నియోజకవర్గంలోని మలికిపురంలో బహిరంగసభ నిర్వహణకు పవన్ సిద్ధమవుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ చేపట్టిన వారాహి యాత్ర ఓ ఎత్తయితే రాజోలు నియోజకవర్గం ఆయనకు మరో ఎత్తు కానుంది. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలులో ఆ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఉన్నారు. అక్కడ వారాహి యాత్ర సందర్భంగా పవన్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాపాకను టార్గెట్ చేస్తూ పవన్ ఏం చెప్పబోతున్నారనే దానిపై జనసేన శ్రేణులతో పాటు వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజోలు వారాహి యాత్రలో రాపాకతో పాటు వైసీపీని కచ్చితంగా టార్గెట్ చేయబోతున్నారు. అయితే అంతకుముందే నియోజకవర్గంలో నేతల్ని భారీగా సమీకరించి బహిరంగసభను బలప్రదర్శనగా మార్చేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. పవన్ సభ ద్వారా రాపాక చేసిన పనిని జనంలోకి పూర్తిస్ధాయిలో తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. దీంతో రాజోలు సభలో పవన్ చేసే ప్రసంగంపై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది.












Click it and Unblock the Notifications