జగన్-షర్మిల మధ్య విజయమ్మ మధ్యవర్తిత్వం-బాలినేని ప్రతిపాదన..!
ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల పోరులో రోజుకో ట్విస్ట్ తప్పడం లేదు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై కోర్టుకెక్కిన వైఎస్ జగన్ పై ఓవైపు ప్రత్యర్థులు విమర్శలు చేస్తుండగా. మరోవైపు మధ్యవర్తిత్వం ప్రతిపాదనలు కూడా ముందుకొస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్ చెల్లి, తల్లిని అడ్డుపెట్టుకుని తన ప్రత్యర్థులు తనను టార్గెట్ చేస్తున్నారని జగన్ ఆరోపిస్తుండగా... షర్మిల మాత్రం ఇది తన అన్నతో నేరుగా జరుగుతునే పోరే అంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ కు బంధువైన మాజీ మంత్రి, ప్రస్తుత జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక ప్రతిపాదన చేశారు. జగన్, షర్మిల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు తల్లి విజయమ్మ ముందుకు రావాలని ఆయన కోరారు. అదే సమయంలో జగన్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఆడపడుచు కన్నీళ్లు ఆ ఇంటికే అరిష్టం అని జగన్ గుర్తించాలని బాలినేని కోరారు. అదే సమయంలో వైసీపీ గతంలో తాను ఎదుర్కొన్న పరిస్ధితులపైనా స్పందించారు.

వైసీపీలో తాను ఏమీ సంపాదించుకోలేదని, ఉన్నవే పోగొట్టుకున్నానని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన బిడ్డ సాక్షిగా ఈ విషయం చెబుతున్నానని బాలినేని తెలిపారు. అలాగే తానేమీ సంపాదించుకోలేదని, ఎలా పోగొట్టుకున్నానో కూడా ఎవరికీ చెప్పుకోలేదని గుర్తుచేసుకున్నారు. తనకు సంస్కారం ఉండటం వల్లే పార్టీ మారాక దీనిపై ఏమీ మాట్లాడలేదని కూడా బాలినేని వెల్లడించారు. ఒకప్పుడు వైసీపీలో కీలక నేతగా, మాజీ మంత్రిగా ఉన్న బాలినేని తాజాగా జనసేన పార్టీలోకి మారారు.












Click it and Unblock the Notifications