భారతి సిమెంట్స్ కోసమే చేశారు..?
జనసేనాని పవన్ కల్యాణ్ ఎప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నారోనని వైసీపీ మంత్రులు కంగారుపడటం దేనికని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, పవన్ సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించారు. పవన్ పై ఉన్న గౌరవంతోనే ప్రధానమంత్రి పిలిపించి మాట్లాడారని, ఏం మాట్లాడారో చెప్పాలని మంత్రులు అడుగుతుంది భయంతోనా అని ప్రశ్నించారు. జనసేనలో ఎవరికివారుగా తమ సొంత అవగాహనతోనే మాట్లాడతారని, మంత్రులకు స్క్రిప్ట్ అందించినట్లే అందరికీ అందదన్నారు.
అధికారం దక్కిన తర్వాత జే గ్యాంగ్ చేసిన అవినీతిని జనసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెలికితీస్తామన్నారు. జగనన్న కాలనీలకు ఇసుక ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడంలేదని, టన్ను రూ.675 పెట్టి కొంటున్నారన్నారు. భారతీ సిమెంట్స్ కు లాభం కలిగేలా చేయడానికి ఇతర సిమెంటు కంపెనీలన్నింటితో కలిపి ధరలు పెంచడంతో 2100 కోట్లరూపాయల భారం పడిందన్నారు. పరిపాలనను గాలికొదిలేసిన మంత్రులు ఆరాలు తీయడమెందుకన్నారు. ఇళ్ల స్థలాలకు గ్రావెల్ 5 కిలోమీటర్ల పరిధిలో నుంచి తరలించాలని నిబంధనను సవరించి దోచుకున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లు, పొక్లెయిన్లతో చదును చేశారని నాగబాబు మండిపడ్డారు.
జనసేన పార్టీ కొన్ని రోజులగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలను సందర్శిస్తోంది. తీవ్రమైన అవినీతి జరిగిందని, వాటన్నింటినీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపెడతామని జనసేన నేతలు ప్రకటించారు.