ఇలా చేస్తారనే... మా దారి మేం చేసుకున్నాం..!!
ఏపీలో భారతీయ జనతాపార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడంతోపాటు విజయవాడలో పవన్-చంద్రబాబు భేటీ లాంటి పరిణామాలున గమనించి తమ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈ సంఘటన జరగకముందు వరకు బీజేపీ నాయకులు జనసేన పార్టీని కానీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కానీ పట్టించుకోలేదు.

ఉలిక్కిపడ్డ బీజేపీ నేతలు
రాజమండ్రిలో గోదావరి గర్జన నిర్వహించినా, అమరావతి గ్రామాల్లో పాదయాత్ర చేసినా.. ఏ కార్యక్రమం నిర్వహించినా సొంతంగానే చేశారు. మిత్రపక్షంగా జనసేన ఉందనే విషయాన్నే గమనించడంలేదంటూ గతంలో ఆ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తన వ్యూహం మార్చుకుంటున్నానని హఠాత్తుగా పవన్ ప్రకటించడంతో పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు. కేంద్రంలో పెద్దలు చంద్రబాబుతో పొత్తు అనే విషయంలో సానుకూల వైఖరితో లేరు.. భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అంచనాకు అందడంలేదు.. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా తమ చేయి జారిపోతే రేపు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అర్థం కాకుండా ఉందటున్నారు.

పార్టీ నేతలపై కన్నా మండిపాటు
అయితే పవన్ మాత్రం తాను అధికార పార్టీపై దూకుడుగా వెళ్లాలని నిర్ణయం తీసుకొని ఆ మేరకు పార్టీ కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. తాను వ్యూహం మార్చినంత మాత్రాన బీజేపీపైకానీ, ప్రధానమంత్రిపైకానీ వ్యతిరేకత ఉన్నట్లు కాదని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నానని ప్రకటించారు. పవన్ కు సంఘీభావం తెలియజేయడానికి సోము వీర్రాజు ఒక్కరే వచ్చి కలిశారు. ఈ విషయంలో తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదంటూ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోయేంతవరకు నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ సంఘటనతో బీజేపీలో నేతల మధ్య విభేదాలు కూడా బయటపడ్డాయి.

రెండు వర్గాలుగా విడిపోయిన ఏపీ బీజేపీ?
భారతీయ జనతాపార్టీలోని నేతలు రెండువర్గాలుగా విడిపోయారు. ఒక వర్గానికి చెందిన నేతలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతుండగా, మరో వర్గం నేతలు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ప్రజల అభిప్రాయం కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటున్నారని ప్రకటించారు. పార్టీలో ఈ రెండు వర్గాలకు చెందిన నేతల్లో ఎవరిది పైచేయి అవుతుందో ఇప్పటికీ స్పష్టత రాలేదు. బీజేపీ నేతలు వైఖరి చూస్తుంటే పవన్ కల్యాణ్ ను అటు టీడీపీకి కాకుండా, ఇటు బీజేపీకి కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనపడుతోందని, సొంతంగా కార్యాచరణ ప్రకటించుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నప్పటికీ బీజేపీ నుంచి సానుకూలత రావడంలేదని, అందుకే తమ దారి తాము చూసుకున్నామని జనసేన పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications