జగన్ మీడియాకు జనసేన కౌంటర్: 'వైసీపీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దాం'
అమరావతి: ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దామని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల అనంతరం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వద్దు, జగన్ వద్దు, లోకేష్ అసలే వద్దని పవన్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీతో జనసేనకు రహస్య ఒప్పందం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీతో అంతర్గత ఒప్పందం ఉందని తెలుగుదేశం పార్టీ గతంలో జనసేనపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలపై జనసేనాని చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. తద్వారా తాము ఇరు పార్టీలకు సమాన దూరమని చెప్పింది.
టీడీపీ, వైసీపీలకు దూరమని చెప్పేందుకు గతంలో పవన్ మాట్లాడిన రెండు వీడియోలను పోస్ట్ చేసింది. మొదటి వీడియోలో జనసేన వచ్చే ఎన్నికల్లో సంపూర్ణంగా 175 సీట్లలో పోటీ చేస్తుందని, తాను కొత్త నాయకత్వం కోసం చూస్తున్నానని, అనుభవజ్ఞులైన నాయకులతో పాటు ఎక్కువ మంది యువతకు అవకాశమిస్తామని తెలిపారు.

జనసేన గౌరవం ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పెట్టామని, దాడులు చేస్తున్నా భయపడమని చెప్పారు. జగన్ రోడ్లపై నడిచి.. నడిచి.. ఓదార్పు యాత్రలు చేయరని, కానీ నిజమైన ఓదార్పు యాత్ర చేయరని, జగన్ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలని, తనకు ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ లేడని, అయినప్పటికీ సమస్యలపై నిలదీస్తున్నామని, పరిష్కరిస్తున్నామని, నాకే ఇంత దమ్ము ఉన్నప్పుడు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్కు ఎంత దమ్ము ఉండాలన్నారు.
అదే సమయంలో, టీడీపీ నేతలకు ఇచ్చిన వార్నింగ్ను కూడా ఆ వీడియోలో జత చేశారు. జగన్, చంద్రబాబులు వద్దని, లోకేష్ అసలే అవసరం లేదని చెప్పారు. జనసేన ప్రభుత్వాన్నిస్థాపించి, మార్పు తీసుకు వద్దామని చెప్పారు. మొత్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీలతో జనసేనకు అంతర్గత ఒప్పందాలు ఉన్నాయనే వార్తలకు కౌంటర్గా ఈ వీడియోలను పోస్ట్ చేశారు. తాజాగా, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ రహస్యంగా భేటీ అయ్యారని, డీల్ జరిగిందని సాక్షిలో వార్త వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోలు పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications