మోడీని కలుస్తాం: అందరికీ కృతజ్ఞతలు.. ఇట్లు జనసేన
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోపర్యటించిన విషయం తెలిసిందే. కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, అనంతపురం జిల్లాల్లో పవన్ జరిపిన ఆరు రోజుల పర్యటన విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ 'జనసేన' కృతఙ్ఞతలు తెలిపింది.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ దృష్టికి పలు సమస్యలు వచ్చాయని పేర్కొంది.
పవన్కు తెలియజేశారు
ముఖ్యంగా కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కరవునకు కారణాలను ప్రజాప్రతినిధులు రైతులు, మేధావులు పవన్కు తెలియజేశారని ఆ ప్రకటనలో వెల్లడించింది.
మూడు రోజులుగా కార్యాలయంలో..
ఈ సమస్యలపై నిపుణులు, పార్టీలోని కొందరు ముఖ్యులతో కలిసి సమస్యలను విశ్లేషించే కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారని పేర్కొంది. గత మూడు రోజులుగా పార్టీ పరిపాలనా కార్యాలయంలో విశ్లేషణ జరుగుతోందని తెలిపింది.
మోడీని కలుస్తారు..
అనంతపురం నీటి కష్టాలపై జనసేన అధ్యక్షుడు చర్చించారని, పవన్ తన పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్యను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తారని వెల్లడించింది.
మలి విడత పర్యటనపై
అంతేగాక, పవన్ కళ్యాణ్ మలి విడత పర్యటనకు కావలసిన ప్రణాళికను పార్టీ ప్రతినిధులు రూపొందిస్తున్నారని, ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు కావాల్సి ఉందని తెలిపింది. ఈ పర్యటన వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, బడ్జెట్ అంశంపై జనసేన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పటికే పలువరు ఈ విషయంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.