Pavan Kalyan: విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చొద్దు: పవన్ కల్యాణ్
విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందన్నారు. విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేసి, ఆ పార్టీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలతో ప్రాంగణాలు నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన చేస్తుందో చెప్పాలన్నారు.
ఫ్లెక్సీలు
ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందని సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందన్నారు. తొమ్మిది దశాబ్దాల పైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మేరకు ఆమోదయోగ్యమైనవి? డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సి.ఆర్.రెడ్డి లాంటి గొప్పవారు ఉప కులపతులుగా బాధ్యతలు చేపట్టిన సరస్వతి ప్రాంగణం ఆంధ్ర విశ్వవిద్యాలయమని పవన్ గుర్తు చేశారు.

మేధావులు
ఆ విద్యా వనం నుంచి ఎందరో మేధావులు వచ్చారని... అలాంటి చోట చిల్లర రాజకీయాలు చేస్తూ, పార్టీ ఫ్లెక్సీలు కట్టించేవాళ్లు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయని నిలదీశారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోనూ అదే తీరు కనిపిస్తుందని చెప్పారు. విశ్వ విద్యాలయ ఉప కులపతులకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ, ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేయాలన్నారు.

విద్యార్థులు, చిరుద్యోగులు
ఉప కులపతులు బాధ్యతలు నిర్వర్తించాలని మనవి చేస్తున్నామన్నారు. విద్యార్థులను, చిరుద్యోగులను ఒత్తిడి చేసి వేడుకలు చేయించడం.. బలవంతపు పార్టీ మార్పిళ్ళకు పాల్పడటం విడిచిపెట్టాలని సూచించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల పవన్ కల్యాణ్ కోరారు. విశ్వ విద్యాలయాల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్ని నిలువరించాలన్నారు. విశ్వ విద్యాలయ అభివృద్ధికి ఉప కులపతులు బాధ్యతగా పని చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications